Chandrababu Delhi Tour: పోయిన చోటే వెతుక్కోవాలంటారు. ఇప్పుడదే పనిలో చంద్రబాబు ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో విభేదించి మూల్యం చెల్లించుకున్నారు. భారీ అపజయాన్ని మూటగట్టుకున్నారు. రెండేళ్ల వ్యవధి ఉండగానే ఎన్టీఏతో తెగతెంపులు చేసుకున్నారు. మోదీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారం సైతం నిర్వహించారు. కానీ అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అన్న మాదిరిగా దారుణ పరాజయం ఎదురైంది. కేవలం 3 ఎంపీ, 23 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు చంద్రబాబుకు తత్వం బోధపడింది. అనవసరంగా బీజేపీని దూరం చేసుకున్నానన్న వ్యధ అయితే మది నిండా ఉంది. కానీ దగ్గరయ్యేందుకు వీలులేని స్థితిలో మోదీని అనరాని మాటలు అనేశారు. దీంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు.
బీజేపీ కోసం తహతహ..
ఈ మూడేళ్లలో చంద్రబాబు బీజేపీని కానీ.. ప్రధాని మోదీని కానీ పల్లెత్తు మాట అనలేదు. అదే సమయంలో బీజేపీతో పొత్తుకు తహతహలాడుతూ వస్తున్నారు. కానీ గత అనుభవాల నేపథ్యంలో బీజేపీ పెద్దలు చంద్రబాబును దూరం పెడుతూ వచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం తన ప్రయత్నాలను ఆపలేదు. అందివచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. కానీ మూడేళ్లుగా ఈ ప్రయత్నాలేవి ఫలించలేదు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు మాత్రం చంద్రబాబుకు కలిసి వస్తున్నాయి. బీజేపీ పెద్దల నుంచి వరుస ఆహ్వానాలు అందుతున్నాయి. అయితే ఉన్నపలంగా బీజేపీ వాయిస్ మారడంపై పొలిటికల్ సర్కిల్ లో మాత్రం రకరకాల కథనాలు మాత్రం వస్తున్నాయి.
నాడు వైసీపీ మైండ్ గేమ్ తో
వాస్తవానికి చంద్రబాబు విభజన హామీల విషయంలో బీజేపీతో విభేదించారు. అదే సమయంలో వైసీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. దీంతో ఎన్టీఏ నుంచి చంద్రబాబు ఒక్కసారిగా వైదొలిగారు. దీంతో వైసీసీ తాను అనుకున్నది సక్సెస్ అయ్యింది. టీడీపీ స్థానాన్ని ఎన్డీఏలో చేరకుండానే భర్తీ చేసింది. దాని ఫలితంగానే 2019 ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహాయ సహకారాలు పొంది భారీ విజయానికి కారణమైందని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే 2024 ఎన్నికల్లో మరోసారి ఆ తప్పిదం జరగకూడదన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలని గట్టి ప్రయత్నంలోనే ఉన్నారు. అటు జనసేనకు స్నేహహస్తం అందిస్తూనే బీజేపీని కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నారు.
ఇటీవల పరిణామాలతో..
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు చంద్రబాబుకు కలిసివచ్చాయి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనూహ్యంగా మద్దతు ప్రకటించారు. తద్వారా బీజేపీకి దగ్గర కావాలన్న ప్రయత్నంలో తొలి మెట్టు ఎక్కగలిగారు. అంతకు ముందు ప్రధాని మోదీ భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. కార్యక్రమానికి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అయితే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు దృష్ట్యా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కార్యక్రమానికి ప్రారంభించారు. అటు తరువాత రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. దీంతో రెండు పార్టీల మధ్య ఓక సహృద్భావ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు తాజాగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహాల్లో భాగంగా ఈ నేల 6న నిర్వహించే సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఓకింత ఆత్మవిశ్వాసం పెరిగింది. బీజేపీతో కలిసేందుకు రూట్ క్లీయర్ అవుతోందని సంతోషిస్తున్నారు.
ప్రధానితో ఏం మాట్లాడతారో?
అయితే హస్తినాలో జరిగే సమావేశాన్ని చంద్రబాబు రాజకీయంగా అనుకూలంగా మలుచుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సమావేశానికి ముందు కానీ.. తరువాత కానీ ప్రధాని మోదీ చంద్రబాబుతో సమావేశమవుతారన్న షెడ్యూల్ అయితే ఏదీ విడుదల కాలేదు. కానీ సమావేశం తప్పక ఉంటుందని మాత్రం టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎన్నికల తరువాత చంద్రబాబు ప్రధాని మోదీని ఒక్కసారి కూడా కలువ లేదు. మొదటిసారి కలుస్తుండడంతో అసలు వారిద్దరు ఏం మాట్లాడుకుంటారు? అన్నది ఇరు పార్టీల శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు అనుకూల వాతావరణం మాత్రం కనిపిస్తోంది. దానికి ఎలాగైనా మరింత బలం చేకూర్చోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More