Homeగెస్ట్ కాలమ్దుబ్బాక విజేతను డిసైడ్ చేసేది మహిళలే!

దుబ్బాక విజేతను డిసైడ్ చేసేది మహిళలే!

Women's vote is crucial in the Dubaka by-election

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక హీట్‌ నడుస్తోంది. అక్కడి ఉప ఎన్నిక హైటెన్షన్‌కు దారితీస్తోంది. అటు అధికార టీఆర్‌‌ఎస్‌.. ఇటు బీజేపీల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవల సిద్దిపేటలోని ఒకరి ఇంట్లో డబ్బులు దొరకడం.. అవి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు సంబంధించినవని పోలీసులు చెప్పడం.. అధికార పార్టీ అందుకు వత్తాసు పలకడం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. మరోవైపు ఆ డబ్బు పోలీసులే తమ ఇళ్లలో పెట్టేందుకు తెచ్చారంటూ బీజేపీ క్యాడర్‌‌, లీడర్లు ఎదురుదాడికి దిగడంతో ఈ నిప్పు మరింత రాజుకున్నట్లైంది. పోటాపోటీగా నడుస్తున్న ఈ ఉప ఎన్నికలో చివరికి విజయం ఎవరి వశం అవుతుందో అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది.

Also Read: ఆవును చంపారు.. సానియా మీర్జాపై విచారణ జరపాలి: రాజాసింగ్ డిమాండ్

అయితే.. ఇంత హాట్‌హాట్‌ రాజకీయాలు నడుస్తున్న దుబ్బాక నియోజకవర్గంలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. ఆ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువున్నా.. ఇప్పటివరకు ఇక్కడ మహిళా ఎమ్మెల్యే ప్రాతినిథ్యం లేదు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికై చట్టసభల్లో గొంతుక వినిపించలేదు. 1957 నుంచి ఈ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ.. మహిళా అభ్యర్థి పోటీచేసిన దాఖలాలు లేవు. అయితే.. ఈ ఉప ఎన్నికతో ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. తొలిసారి ఇద్దరు మహిళలు పోటీలో నిలిచారు. వీరితోపాటు మరో 22 మంది పురుష అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఉమెన్ ఓట్లపైనే పడింది.

దుబ్బాక ఉప ఎన్నికలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కుస్తీ పడుతున్నాయి. బీడీ కార్మికులుగా పనిచేస్తున్న అబలల ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ ప్రచారానికి నాయకత్వం వహించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇటీవల ర్యాలీలో మహిళా బీడీ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో బీడీ కార్మికులకు ఇచ్చే 2 వేల పింఛనులో 1,600 ప్రధాని మోడీ ఇస్తున్నారని బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ఫైర్‌ అయ్యారు. బీడీ కార్మికులకు ఇచ్చే పింఛనులో 16 పైసలు కూడా ప్రధాని ఇవ్వట్లేదన్నారు. మోడీ డబ్బులు ఇస్తున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వట్లేదని విరుచుకుపడ్డారు.

మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మహిళా నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. మొత్తం 1,98,807 మంది ఓటర్లలో 1,00,779 మంది స్త్రీలు ఉండగా..98,026 మంది పురుషులు ఉన్నారు. నియోజకవర్గంలో దుబ్బాక, మిర్‌దొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయ్‌పోల్, చేగుంట, నర్సింగి, గజ్వేల్ మండలాల్లో మహిళా ఓటర్లు పురుషుల కన్నా అధికంగా ఉన్నారు. ఉదాహరణకు దుబ్బాక మండలంలో 55,208 మంది ఓటర్లలో 27,983 మంది స్త్రీలు, 27,725 మంది పురుషులు ఉన్నారు.

దీంతో ఈసారి మహిళా లీడర్లు ప్రచార రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు కోసం మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ప్రచారం చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని సుజాత అంటున్నారు. తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు.

Also Read: ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీచేస్తాం: జనసేన

ఇక బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు కోసం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర మహిళా నాయకురాళ్లు ముమ్మరంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చేసేందేమీ లేదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీకి చెందిన ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే సీతక్క దుబ్బాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపే స్వయం సహాయక బృంద మహిళలతో మాట్లాడటానికి అన్ని పార్టీలు మహిళా నాయకురాళ్లను నియమించాయి. తమ పార్టీ అభ్యర్థులకు వారి మద్దతు కోరుతూ స్వయం సహాయక సంఘం మహిళా లీడర్లతో క్రమం తప్పకుండా సమావేశమవుతున్నారు.

స్థానిక మహిళా సర్పంచ్‌లు, మండల పరిషత్ నాయకురాళ్లు తమ పార్టీల అభ్యర్థుల కోసం ప్రచారం చేయిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇద్దరు మహిళలు ఈ ఎన్నికలో పోటీ చేస్తుండడం. టీఆర్‌ఎస్‌ నుంచి సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా టీవీ యాంకర్ కె.కార్తీక బరిలో ఉన్నారు. మరి మహిళా ఓటర్లకు కంచుకోటలా ఉన్న ఈ దుబ్బాకలో ఎవరికి పట్టం కడుతారో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version