Value Of That Skeleton Is Rs.48.5 Crores: డబ్బులు ఉండాలి.. కొనుక్కోవాలన్న ఆసక్తి ఉండాలే కానీ ప్రపంచంలో బహుషా కొనలేనిది ఏదీ ఉండకపోవచ్చు. అది విలువైన వస్తువైనా.. అరుదైన అస్థి పంజరమైనా. ఇలాగే ఓ సంపన్నుడు ఓ అస్థి పంజరాన్ని ఏకంగా రూ.48.5 కోట్లు పెట్టి కొన్నాడు. ఇదేంటిరా బాబు వాడికి ఇదేం పిచ్చి అనుకుంటాం. కాన్నీ ఆయన కొన్నది సాధారణ బొమికల గూడు కాదు.. ప్రపంచంలోనే అరుదైన తొలినాటి డైనోసార్లలో ఒకటైన గొర్గోసారస్ అస్థి పంజరం. దీనికి పేరుపెట్టే హక్కును కూడా ఆయనే దక్కించుకున్నాడు.

పది అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవున్న డైనోసార్
గొర్గోసారస్ అస్థి పంజరం కోట్ల ఏళ్ల కిందటిది. పైగా అది సాదా సీదా అస్థి పంజరం కాదు.. డైనోసార్లలో భయంకరమైన టైరనోసారస్ రెక్స్ (టీ రెక్స్) కంటే ముందునాటి గోర్గోసారస్ డైనోసార్ది. తొలితరం డైనోసార్లు తిరుగాడిన క్రేటాషియస్ కాలానికి చెందిన భయానక మాంసాహార డైనోసార్లలో గొర్గోసారస్ ఒకటని.. అమెరికా, కెనడా ప్రాంతాల్లో ఇది జీవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గొర్గోసారస్ అస్థి పంజరాన్ని 2018లో అమెరికాలోని మోంటానాలో జుడిత్ నది సమీపంలో గుర్తించారు. పది అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు ఉన్న ఈ అస్థి పంజరం 7.7 కోట్ల ఏళ్ల కింద తిరుగాడిన డైనోసార్దిగా నిర్ధారించారు.
అమెరికాలో వేలం..
ప్రఖ్యాత సోత్ బీ వేలం శాల జూలై 21న న్యూయార్క్ లో దీనిని ప్రదర్శనకు ఉంచింది. తాజాగా వేలం వేయగా.. 6.1 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.48.5 కోట్లు) పలికింది. గొర్గోసారస్ డైనోసార్లు రెండు టన్నుల వరకు బరువు తూగేవని.. టీ రెక్స్ కన్నా వేగంగా, బలంగా దాడి చేసేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గార్గోసారస్లు ఏకంగా 42 వేల న్యూటన్ల బలంతో కొరికేసేవని అంచనా వేశారు. మనకు తెలిసిన అత్యంత బలమైన సింహాలు, పులులు కొరికే బలం నాలుగైదు వేల న్యూటన్లు మాత్రమే. అంటే సింహం కంటే పదింతలు బలంతో దాడి చేసేవన్న మాట.
రికార్డు ధర పలికినవి ఇవే..
ఇంతకుముందు 1997లో టీ–రెక్స్ డైనోసార్ అస్థి పంజరాన్ని వేలం వేశారు. దాని విలువ అప్పుడు 8.36 మిలియన్ డాలర్లు పలికింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.66.36 కోట్లు. 2020లో మరో టీ–రెక్స్ అస్థి పంజరాన్ని వేలం వేశారు. దీనిని ఏకంగా 31.8 మిలియన్ డాలర్లు, భారత కరెన్సీ ప్రకారం రూ.252.5 కోట్లు పలకడం విశేషం.