Netflix : కాందహార్ విమానం హైజాక్ కథ.. నెట్ ఫ్లిక్స్ కు నిరసన సెగ.. ఇండియాలో ఎందుకు ఇంత పెద్ద వివాదమైందంటే?

ఓటీటీలలో అత్యధిక ఆదరణ ఉన్న సంస్థగా నెట్ ఫ్లిక్స్ పేరుంది. ప్రపంచంలోనే అత్యధిక యూజర్ బేస్ ఈ ఓటీటీ సొంతం. ద్వంద్వార్థాలతో కూడిన సినిమాలు, పెద్దల కంటెంట్ తో కూడిన వెబ్ సిరీస్ లు నిర్మిస్తుందని ఈ ఓటీటీ పై ఎప్పటినుంచో ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా మనదేశంలో ఈ ఓటీటీ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : September 2, 2024 10:34 am

Netflix

Follow us on

Netflix :  నెట్ ఫ్లిక్స్ పై నెటిజన్ల లో ఈ స్థాయిలో ఆగ్రహానికి ప్రధాన కారణం IC 814 అనే వెబ్ సిరీస్. దీనికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, విజయ్ వర్మ, అరవిందస్వామి ఈ వెబ్ సిరీస్ లో రకరకాల పాత్రలు పోషించారు. 1999 కాందహార్ హైజాక్ కథాంశంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ లో ఉగ్రవాదులకు భోళా, శంకర్, డాక్టర్, బర్గర్, చీఫ్ అనే పేర్లు పెట్టారు. వాస్తవానికి హైజాకర్ల పేర్లు ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్, సన్నీ, అహ్మద్ ఖాజీ, జహీర్ మిస్త్రీ, షకీర్. వీరి పేర్లను మార్చడం పట్ల వివాదం నెలకొంది. వారి పేర్లను మార్చి ఉగ్రవాదులపై మానవీయ కోణం కలిగేలాగా చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఉగ్రవాదులు ఆ తర్వాత 2001 పార్లమెంట్ పై దాడి, 2008లో ముంబైపై దాడి.. ఇతర ఘటనల్లో పాల్గొన్నారని నెటిజన్లు చెబుతున్నారు. “ఉగ్రవాదం పై సానుకూల దృక్పథం కలిగేలా చేసి.. హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారని” నెటిజన్లు మండిపడుతున్నారు..”హైజాకర్ల పేర్లు ఇబ్రహీం, షాహిద్, సన్నీ అహ్మద్, జహూర్ మిస్త్రి, షకీర్ అయితే వారి పేర్లను శంకర్, భోళా అని మార్చారు. ఇది ఎంతవరకు న్యాయమని” నెటిజన్లు వాదిస్తున్నారు.. కొంతమంది అయితే #BanNetflix అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ను ట్యాగ్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ నిర్మించిన వారిపై, ప్రసారం చేస్తున్న నెట్ ఫ్లిక్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పేరు ఎందుకు మార్చినట్టు

ఈ వెబ్ సిరీస్ దర్శకుడు అనుభవ్ సిన్హా .. “ఉగ్రవాదానికి మతం లేదు” అని పేర్కొన్నాడు. అలాంటప్పుడు ఆ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదుల పేర్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం లేదు.. ఈ సిరీస్ లో 1999 లో ప్రభుత్వం తీసుకున్న విధానాలను, హఫీజ్ సయీద్ విడుదలకు దారి తీసిన పరిస్థితులు భవిష్యత్తులో తీవ్రవాదానికి ప్రభుత్వం భయపడే పరిణామాలను సృష్టించిందని విశ్లేషకులు అంటున్నారు.. నాటి ఘటనలో విమానం పంజాబ్ నుంచి ఎలా వెళ్ళిపోయింది? దానికి నాటు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇచ్చింది? వంటి సన్నివేశాలు తీవ్ర వివాదానికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు ఈ వెబ్ సిరీస్ లో సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బాలీవుడ్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వెబ్ సిరీస్ పై తీవ్రమైన చర్చ జరుగుతోంది. మెజారిటీ నెటిజన్లు బాలీవుడ్, నెట్ ఫ్లిక్స్ తీరును తప్పు పడుతున్నారు.