Vivekananda Reddy Biopic: ఏపీలో మరో బయోపిక్ బయటకు వచ్చింది. అయితే అది నేరుగా సినిమా ధియేటర్లో కాదు. ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా.. పెయిడ్ స్క్రీనింగ్ ద్వారా విడుదల చేశారు. అయితే ఇంతకీ ఈ బయోపిక్ ఎవరిది అనుకుంటున్నారా? వైయస్ వివేకానంద రెడ్డి ది. ఆయనపై సినిమా తీస్తున్నారని ఇంతవరకు బయటపడలేదు. తీయడం, ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా విడుదల చేయడం జరిగిపోయింది. కేవలం 100 రూపాయలు పెడితే చాలు పెయిడ్ స్క్రీన్ ద్వారా సినిమాను చూడవచ్చు. ఇటీవల బయోపిక్ లకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఈ చిత్ర నిర్మాణదారులు జాగ్రత్తపడ్డారు. సినిమాను రూపొందించి నేరుగా విడుదల చేయగలిగారు.
హఠాత్తుగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ వెలుగు చూసింది. విపరీతంగా వైరల్ అయ్యింది. అంతవరకు వివేకానంద రెడ్డి పై బయోపిక్ తీసారని ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రత్యేక వెబ్ సైట్ లో ఈ సినిమా ఉందని తెలియడంతో నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వివేక బయోపిక్ అనే వెబ్ సైట్ లో ఈ సినిమాకు సంబంధించి పూర్తి నిడివి గల వీడియోని పెట్టారు. 100 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు మొత్తం సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇది పూర్తిగా వివేకానంద రెడ్డి బయోపిక్ అని ప్రచారం చేస్తున్నారు. ఆయన ఫోటోలను సైతం వాడుకున్నారు. ఇంతకుముందు రాంగోపాల్ వర్మ వ్యూహం, శపధం సినిమాలకు న్యాయచిక్కులు ఎదురైన సంగతి తెలిసిందే. అందుకే వివేకానంద రెడ్డి బయోపిక్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
చాలా క్వాలిటీ గా ట్రైలర్ వచ్చింది. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అన్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. అటు పేర్లు సైతం నిజజీవితంలో వినిపించినవిగా.. దగ్గరగా ఉండేలా చూసుకున్నారు. ట్రైలర్ను ఆకట్టుకునే రీతిలో రూపొందించడం విశేషం. అయితే వ్యూహం, శపథం సినిమాల విషయంలో రాంగోపాల్ వర్మ చేసిన అతి అంతా ఇంతా కాదు. ఒకటి రెండుసార్లు రామ్ గోపాల్ వర్మ తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ కలిశారు. ఆ రెండు సినిమాల చిత్రీకరణకు సంబంధించి ఎన్నో రకాల మినహాయింపులు ఆర్జీవికి దక్కాయి. దీంతో సినిమాలపై అంచనాలు పెరిగాయి. అదే సమయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. కానీ అటువంటి హడావిడి లేకుండా వివేకానంద రెడ్డి బయోపిక్ ఇట్టే బయటకు వచ్చింది. సినీ జనాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.