Vidya Balan : పడిపోయినా.. హృద్యంగా చెప్పగలగడమే ఆర్టిస్టు లక్షణం.. అది విద్యాబాలన్ కు నూరుపాళ్ళు ఉంది..

సక్సెస్ వస్తే నడి నెత్తిన కళ్లు రావడం.. ఫెయిల్యూర్ వస్తే నేల చూపులు చూడటం.. సినిమా ఇండస్ట్రీలో కామన్. అయితే విజయాలను, అపజయాలను సమానంగా చూసి.. దీర్ఘకాలం కెరియర్ కొనసాగించేవాళ్లు ఇండస్ట్రీలో తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో విద్యాబాలన్ ముందువరుసలో ఉంటారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 26, 2024 1:04 pm

Vidya Balan

Follow us on

Vidya Balan : విద్యాబాలన్ సినిమా ప్రయాణం కేక్ వాక్ కాదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. మరెన్నో కష్టాలు అనుభవించింది. 16 సంవత్సరాల వయసులో ఎక్తా కపూర్ నిర్మించిన “హమ్ పాంచ్” అనే సీరియల్లో నటించి రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత సినిమాల్లోకి మెల్లిగా అడుగులు వేసింది. తన పుట్టింది కేరళలో కాబట్టి దక్షిణాదిన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేసింది. మోహన్ లాల్ సరసన 2001లో చక్రం అనే సినిమాలో నటించేందుకు ఎంపికైంది. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత తమిళంలో మాధవన్ సరసన రన్ అనే సినిమాకు ఎంపికైంది. ఆ తర్వాత ఆమె స్థానాన్ని మీరాజాస్మిన్ ఆక్రమించింది. మరో తమిళ సినిమాలోనూ ఇదే పరిస్థితి. అనేక తంటాలు పడి 2005లో పరిణిత అనే ఓ బాలీవుడ్ సినిమాలో నటించింది. అందులో ఆమె నటనను చూసి బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తన మున్నాభాయ్ ఎంబిబిఎస్ లో అవకాశం ఇచ్చాడు. ఇక తర్వాత విద్యాబాలన్ వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. హే బేబీ, నో వన్ కి** జెస్సికా, బుల్ బులాయియా ఫ్రాంచైజీ, డర్టీ పిక్చర్, పా, కహాని, కిష్కియా, షాదీకి సైడ్ ఎఫెక్ట్స్, ఘన్ చక్కర్, కిస్మత్ కనెక్షన్ వంటి సినిమాల్లో నటించి బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. తన కెరియర్ పీక్ లో ఉన్నప్పుడే డర్టీ పిక్చర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా అందులో బో** సన్నివేశాల్లో ఎటువంటి బిడియం లేకుండా నటించి సంచలనం సృష్టించింది.

భేష్ విద్యాబాలన్

విద్యాబాలన్ కు, దక్షిణాది నటి ప్రియమణి వరుసకు సోదరి అవుతారు. ఆమె కూడా దక్షిణాదిన అనేక సినిమాల్లో నటించారు. విద్యాబాలన్ సహజంగానే నర్తకి. పైగా ఆమె పుట్టింది కేరళలో కాబట్టి కథాకళి నృత్యాన్ని అద్భుతంగా చేయగలరు. అందువల్లే ఆమెకు చంద్రముఖి బాలీవుడ్ రీమే బుల్ బూలాయియాలో అవకాశమిచ్చారు. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి.. అవన్నీ సూపర్ హిట్ లుగా నిలిచాయి. తాజాగా ఈ సిరీస్లో మూడవ సినిమా వస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రముఖ పాత్రలో పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో విద్యాబాలన్ పాల్గొంటున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సినిమాలోని ” అమీ జే తోమర్” అనే పాటకు మాధురి దీక్షిత్ తో కలిసి విద్యాబాలన్ డ్యాన్స్ చేశారు.. అయితే అలా డ్యాన్స్ చేస్తున్న క్రమంలో విద్యాబాలన్ ఒకసారిగా కింద పడిపోయారు.. అయినప్పటికీ తనను తాను సంభాళించుకున్నారు. వెంటనే పైకి లేస్తే చూసేవాళ్ళు వేరే విధంగా అనుకుంటారని భావించి.. కింద పడిపోయినప్పటికీ అందులోనూ ఒక నృత్య రూపకాన్ని విద్యాబాలన్ ప్రదర్శించారు. క్రమంగా తన కాళ్లను, చేతులను లయబద్ధంగా తిప్పుతూ చూస్తున్న ప్రేక్షకులను సమ్మోహితులను చేశారు. అంతేకాదు పక్కనే ఉన్న మాధురి దీక్షిత్ కూడా ఆశ్చర్యపోయే విధంగా నృత్య భంగిమలను ప్రదర్శించారు.. ఈ వీడియోని చూసి అభిమానులు విద్యాబాలన్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు..” భేష్ విద్యాబాలన్.. పడిపోయినా స్వతహాగా లేవడం గొప్ప విషయం. అది ఒక కళాకారిణి గా సహజంగా అలవడాలి. అప్పుడే కెరియర్ లో నిలదొక్కుకోగలరు.. మరింత స్థిరంగా నిలబడగలరని” వ్యాఖ్యానిస్తున్నారు.