Megastar Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం.. కానీ బన్నీ తర్వాతే..

పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు యూఏఈ ప్రభుత్వం పదేళ్ల కాలపరిమితితో ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : May 28, 2024 3:50 pm

Megastar Chiranjeevi

Follow us on

Megastar Chiranjeevi: తెలుగు సినీ నటుడు.. ఇటీవలే పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న చిరంజీవికి తాజాగా మరో గౌరవం దక్కింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) గోల్డెన్‌ వీసా(UAE Golden Visa) అందుకున్నారు మెగాస్టార్‌. వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసా అందిస్తంది. తాజాగా దీనిని అందుకున్న సినీ ప్రముఖుల్లో మెగాస్టార్‌ చిరంజీవి (Mega star Chiranjeevi)కూడా చేరారు. దీంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరికి ఇస్తారంటే..
పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు యూఏఈ ప్రభుత్వం పదేళ్ల కాలపరిమితితో ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇప్పటి వరకు భారత సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ గోల్డెన్‌ వీసా అందుకున్నారు. జాబితాలో షారూఖ్‌ ఖాన్, రజినీకాంత్, అల్లు అర్జున్, దుక్కర్‌ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, మమ్ముట్టి, టోవినో థామస్‌ తదితరులు ఉన్నారు.

అల్లు అర్జున్‌ తర్వాతే చిరుకు..
ఇక తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే మొదట ఈ గోల్డెన్‌ వీసాను అల్లు అర్జున్‌ అందుకున్నారు. 2021లో మెగాస్టార్‌ కోడలు ఉపాసన కూడా అందుకున్నారు. తర్వాత చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. తెలుగు ఆడియన్స్‌కు పరిచయం ఉన్న, తెలుగు సినిమాల్లో నటించిన రజినీకాంత్, మమ్ముట్టి, దుక్కర్‌ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాలు కూడా చిరంజీవికన్నా ముందే ఈ గోల్డెన్‌ వీసా అందుకున్నారు.

గోల్డెన్‌ వీసా అంటే..
యూఏఈ ఈ గోల్డెన్‌ వీసాలను 2019 నుంచి జారీ చేస్తుంది. గోల్డన్ వీసా హోల్డర్లు ఆ దేశంలో దీర్ఘకాలంపాటు ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు అవకాశం ఉంటుంది. విదేశీయులకు నివాసం, పని చేసుకోవడం, అధ్యయనానికి ఎలాంటి స్పాన్సర్‌షిప్‌ అవసరం లేకుండా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఈ గోల్డెన్‌ వీసాను మొదట బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ అందుకున్నారు. తర్వాత బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్, సునీల్‌శెట్టి, సింగర్స్‌ సోనూ నిగమ్, నేహా కక్కర్, బుల్లితెర హాట్‌ బ్యూటీ మౌనీరాయ్, ఫరాఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, బోనీకపూర్‌తోపాటు బోనీ కుటుంబం ఈ వీసా పొందింది. క్రీడారంగం నుంచి సానియామీర్జాకు గోల్డెన్‌ వీసా దక్కింది. ఒడిశాకు చెందిన ఆర్టిస్ట్‌ మోనా విశ్వరూప మోహంతికి కూడా దుబాయ్‌ గోల్డెన్‌ వీసా జారీ చేసింది.

విశ్వంభరలో బిజీ..
ఇదిలా ఉండగా చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బింబిసారా ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమా తెరకెక్కుతోంది. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీస్తున్నారు. త్రిష ఇందులో చిరంజీవి సరసన నటిస్టుంది. ఆమెతోపాటు ఆషికా రంగనాథ్, సురభి, ఈషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి ముద్దుగుమ్మలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. 2025 సంక్రాంతికి దీనిని విడుదల చేయనున్నారు.

Tags