‘వకీల్ సాబ్’ బ్లాక్ బస్టర్ అయిపోవడంతో.. సమ్మర్ బిజినెస్ బంబాట్ గా స్టార్ట్ అయ్యిందని ఇండస్ట్రీ సంబరపడింది. సమ్మర్ నుంచి పెద్ద చిత్రాలన్నీ లైన్లో ఉండడంతో.. బాక్సాఫీస్ గలగలలాడడం ఖాయం అనుకున్నారు. కానీ.. రోజుల వ్యవధిలోనే ఉగ్ర రూపం దాల్చిన కరోనా.. ఆశలను అడియాశలు చేసిందనే చెప్పాలి. థియేటర్లపై తెలుగు రాష్ట్రాలు ఇంకా ఎలాంటి ఆంక్షలూ ప్రకటించకపోయినా.. పెద్ద చిత్రాలను వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారు మేకర్స్.
దీనికి ప్రధాన కారణం.. థియేటర్ కు రావడానికి జనాలు భయపడుతుండడమే! దేశంలో కరోనా కేసులు లక్షలాదిగా పెరిగిపోతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రోజూ వేలాది కేసులు బయటపడుతున్నాయి. దీంతో.. జనాల్లో భయం ఆవహించింది. ఇలాంటి పరిస్థితుల్లో సాహసం చేసి థియేటర్ కు వెళ్లాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయానికి వచ్చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 50 శాతం ఆక్యుపెన్సీని అమల్లోకి తెచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఇలాంటి గందరగోల పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయడం ఎందుకని భావిస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం చిత్రాలు వాయిదా పడడమే ఇందుకు నిదర్శనం.
ఇక, ఆ తర్వాత రాబోయేవి పెద్ద చిత్రాలే. మెగాస్టార్ ఆచార్య, వెంకటేష్ నారప్ప, బాలకృష్ణ అఖండ సినిమాలు వరుసగా ఉన్నాయి. వీటితోపాటు రవితే ఖిలాడి, కేజీఎఫ్-2, ప్రభాస్ రాధేశ్యామ్, అల్లు అర్జున్ పుష్ప చిత్రాలను కూడా వాయిదా వేసే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
రాధేశ్యామ్ ప్యాచ్ వర్క్ ఇంకా పెండింగ్ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. పుష్ప పనులు ఆగస్టు నాటికి కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అంటున్నారు. ఇక, జక్కన్న చెక్కుడు కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియట్లేదు.
ఎలాగో కరోనా గోల ఉన్నది కాబట్టి.. టైమ్ తీసుకొని సినిమాను మంచిగా తీర్చిదిద్ది.. కొవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాతే రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట మేకర్స్. సెకండ్ వేవ్ దారుణంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో సాహసం చేసి మరీ.. రిలీజ్ చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట. మరి, ఏం జరుగుతుంది? అన్నది చూడాలి.
K.R. is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More