కరోనా కొట్టిన దెబ్బకు రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీ విలవిల్లాడుతోంది. సినిమా షూటింగులు మొదలు.. రిలీజుల వరకు అన్నీ ఆగిపోయాయి. ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్నవి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నవి, షూటింగ్ ముగించుకున్నవి.. ఇలా అన్ని సినిమాలూ ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. ఇప్పటికే.. అంతో ఇంతో సినిమాల మీద ఖర్చు చేసిన వారు.. కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమా కంప్లీట్ చేసిన వారు.. తీవ్రంగా నష్టపోతున్నారు. నెలనెలా వడ్డీలు పెరిగిపోతుండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దీంతో.. కొందరు అనివార్యంగా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా రిలీజైన ‘నారప్ప’ పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుండడంతో.. మరికొందరు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు.
థియేటర్లో రిలీజ్ చేస్తే బెనిఫిట్ ఎంతగా ఉంటుందో.. రిస్క్ అంతకన్నా ఎక్కువే ఉంటుంది. సినిమా ఆడితే సరే.. బాగోలేదని టాక్ స్ప్రెడ్ అయ్యిందంటే ఖతమే. అసలే.. 2 నుంచి 5 శాతం సక్సెస్ రేటు మాత్రమే ఉన్న ఇండస్ట్రీలో మేజర్ గా నష్టాలే ఎక్కువగా వస్తుంటాయి. అయితే.. ఓటీటీలో రిలీజ్ చేస్తే.. ఈ సమస్య ఉండదు. ఆ సంస్థలు ముందుగానే నిర్మాతకు డబ్బులన్నీ చెల్లిస్తాయి. (పే అండ్ వ్యూ తరహాలోనూ రిలీజ్ అవుతాయి.. అది వేరే సంగతి) అంటే.. ఓటీటీలో రిలీజ్ చేయడం అంటే సినిమా మొత్తాన్ని అమ్మేసినట్టు లెక్క. డబ్బులు మొత్తం ముందుగానే ముడతాయి కాబట్టి.. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా నిర్మాతకు సంబంధం లేదు. అందుకే.. మొత్తం బడ్జెట్ పై మార్జిన్ చూసుకొని ఓటీటీకి సినిమాలను ఇచ్చేస్తుంటారు.
ఈ కోణంలో చూసుకున్న భారీ లాభాలు ఆశించకుండా.. టేబుల్ ప్రాఫిట్ గ్యారెంటీతో సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. పెద్ద సినిమాలకైతే.. ఆ రేంజ్ లోనే డీల్ సెటిల్ చేసుకుంటున్నాయి. వెంకటేష్ నారప్ప చిత్రం ఈ కోవకు చెందినదే. తెలుగులో వెంకీ స్టార్ డమ్ ఏంటనేది అందరికీ తెలిసిందే. అందుకే.. అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.35 కోట్ల ఆఫర్ ప్రకటించింది. దీంతో.. మేకర్స్ ఏమీ ఆలోచించకుండా ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ విధంగా.. సినిమా రిలీజ్ కు ముందే లాభాల పంట పండించుకున్నారు. అదే.. థియేటర్ కోసం వేచి చూస్తే.. పరిస్థితి ఖచ్చితంగా మరోలా ఉండేది. అవి ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. తెరుచుకున్నా.. జనాలు రావడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయలేకుండా ఉంది. అందుకే.. ఓటీటీలో రిలీజ్ చేసి మంచి పనిచేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో మిగిలిన చిత్రాలు కూడా రెడీ అవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ లో వకీల్ సాబ్ చిత్రం తర్వాత రావాల్సిన సినిమాలన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. వాటిల్లో విరాట పర్వం, లవ్ స్టోరీ వంటి చిత్రాలు కూడా ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం కూడా సాగింది. అయితే.. ఇప్పుడు నారప్ప సక్సెస్ ఫుల్ గా బిజినెస్ కంప్లీట్ చేసుకోవడంతో.. మిగిలిన చిత్రాలు కూడా ఓటీటీ బాట పట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి, ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయో.. మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.