సెకండ్ వేవ్ దెబ్బ చూసిన తర్వాత ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యం అనే అభిప్రాయానికి వచ్చేశారు చాలా మంది. కానీ.. ఊహించని విధంగా తక్కువ సమయంలోనే సాధారణ పరిస్థితులు వచ్చేశాయి. మొదటి దశ లాక్ డౌన్ లో ఏకంగా ఎనిమిది నెలలపాటు లాక్ డౌన్ కొనసాగింది. కానీ.. ఇప్పుడు మాత్రం రెండు నెలల్లోనే అంతా సెట్టైపోయింది. తెలంగాణలో లాక్ డౌన్ కూడా ఎత్తేశారు. కానీ.. థియేటర్ మాత్రం తెరుచుకోలేదు. బొమ్మ పడలేదు.
ఏపీలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అక్కడ ఇంకా లాక్ డౌన్ రద్దు చేయలేదు. సడలింపులతో కూడిన కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. దీంతో.. సినిమా థియేటర్లు తెరుచుకోవట్లేదు. నిజానికి థియేటర్ల మీద అక్కడి ప్రభుత్వం అంక్షలు విధించింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సడలింపుల సమయానికి అనుగుణంగా ఒక ఆట ఆడించేందుకు విశాఖలో ఓ థియేటర్ కూడా తెరుచుకోబోతోందని ప్రచారం జరిగింది. కానీ.. అది కూడా ఓపెన్ అయినట్టు లేదు.
తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా.. ఒక్క రాష్ట్రాన్ని బేస్ చేసుకొని సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదు. అందుకే.. నిర్మాతలు వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. పోనీ.. ఓటీటీలోనైనా సినిమాలు వస్తున్నాయా? అంటే.. అదీ లేదు. ఆ మధ్య చిన్నా చితకా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ.. నామ మాత్రమే. నారప్ప, విరాటపర్వం వంటి సినిమాలు ఓటీటీలోనే రాబోతున్నాయనే వార్తలు వచ్చాయి. కానీ.. పరిస్థితులు చక్కబడడంతో.. వాటిని కూడా థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు చూస్తున్నట్టు సమాచారం.
ఈ విధంగా.. సినిమాలు అటు థియేటర్లో విడుదల కావట్లేదు, ఇటు ఓటీటీలో కూడా బొమ్మ పడట్లేదు. ఫలితంగా.. ప్రేక్షకుడికి సరైన వినోదం లభించట్లేదు. మరి, ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. అప్పటి వరకూ అరిగిపోయిన రికార్డు మాదిరిగా.. చూసిన సినిమాలే ఓటీటీలో చూసుకోవడం మినహా.. ఆడియన్స్ కు ఆప్షన్ లేకుండాపోయింది.