Sushanth: ఒకప్పుడు నా హీరోయిన్ కానీ ఇప్పుడు మాత్రం తమన్నా నాకు సిస్టర్ : సుశాంత్

సుశాంత్ మొదటి సినిమా కాళిదాసులో తమన్నా హీరోయిన్. ఇక ఎన్నో సంవత్సరాల తరువాత మళ్లీ సుశాంత్ తమన్నా కలిసి ఈ బోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు.

Written By: Swathi, Updated On : August 4, 2023 3:45 pm

Sushanth

Follow us on

Sushanth: కాళిదాసు సినిమాతో మనకు పరిచయమైన హీరో సుశాంత్. నాగార్జున మేనల్లుడుగా సినిమా వారికి పరిచయమైన ఈ హీరో తరువాత ఎన్నో సినిమాలు చేసి కొన్ని హిట్లు మాత్రమే అందుకున్నాడు. చి ల సౌ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత అలా వైకుంఠపురం లో సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించి, తాను వేరే హీరోల సినిమాలలో చిన్న రోల్స్ చేయడానికి కూడా సిద్ధమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు సుశాంత్.

సుశాంత్ మొదటి సినిమా కాళిదాసులో తమన్నా హీరోయిన్. ఇక ఎన్నో సంవత్సరాల తరువాత మళ్లీ సుశాంత్ తమన్నా కలిసి ఈ బోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే మొదటి సినిమాలో హీరో హీరోయిన్లు కనిపించిన వీరిద్దరూ ఈ చిత్రంలో మాత్రం అన్నాచెల్లెలుగా కనిపించానున్నారంట. ఇక ఇదే విషయంపై మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు సుశాంత్.

ముందుగా చిరంజీవి గురించి మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచీ చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయనకి అభిమానులుగా పెరిగాం. చిన్నప్పటి నుంచీ ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఆయన సాంగ్ షూటింగ్‌కి రెండు మూడు సార్లు వెళ్లాను. ఆయన డ్యాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడిని. మెహర్ రమేష్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. చాలా నచ్చింది. అందులోనూ ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు. మెగాస్టార్‌తో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం. ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది. అందుకే మెహర్ రమేష్ చెప్పినప్పుడే చిరంజీవితో డ్యాన్స్ స్టెప్స్ ఉండాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాను’ అని సుశాంత్ చెప్పుకొచ్చారు.

ఇక ‘భోళా శంకర్’ సినిమాలో తన పాత్ర గురించి సుశాంత్ వివరిస్తూ.. ‘ఇది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండే మూవీ. ఇందులో నాది క్యామియో రోల్. నా పాత్ర చాలా ఛార్మింగ్‌గా ఉంటుంది. చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నాతో నాకు కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేశా. నా మొదటి సినిమా హీరోయిన్ తమన్నా. భోళాలో మాత్రం బ్రదర్ సిస్టర్‌గా చేశాం. హీరోయిన్ కీర్తి సురేష్‌తో సీన్స్ చేస్తునప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. చిరంజీవితో సీన్స్ చేస్తున్నపుడు మాత్రం చాలా ఎగ్జయిట్మెంట్ వచ్చింది. చిరంజీవిలోని ప్రత్యేక ఏమిటింటే.. అందరితో సరదాగా ఉంటూ జోక్స్ వేస్తూ అందరినీ కంఫర్ట్ జోన్‌లో ఉంచుతారు. ఇందులో ఆయన టాక్సీ డ్రైవర్‌గా ఉండగా ఒక సీన్ చేశాం. అందులో నేను పాసింజర్‌ని. ఆయన డోర్ తీస్తుంటే నాకు ఏదోలా అనిపించింది. నేనే డోర్ తీసి బయటికి వస్తుంటే.. ‘ఇందులో నీ గౌరవం కనిపించిపోతుంది. నేనే తీయాలి’ అని చెప్పుకొచ్చారు ఈ హీరో.

మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌‌ను నిర్మించారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సుశాంత్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.