Actress VIjaya Santhi: తెలుగు తెరపై మెరిసిన హీరోయిన్లలో విజయ శాంతి క్రేజే వేరు. ‘కర్తవ్యం’ సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్న ఆమెను అభిమానులు లేడీ అమితాబ్ అని పిలిచేవారు. 2006లో ‘నాయుడమ్మ’ తర్వాత పూర్తిగా దూరమైన విజయశాంతి రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. మహేశ్బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా 14ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలు రాయలసీమ ప్రాంతాలకు మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు. తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి.
ఈ మేరకు ఈ అకాల వర్షాలపై సినీ నటి విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లక్షలాది ఎకరాలు నీట మునిగగా చేతికందిన పంట నీటి పాలైంది. వరద సృష్టించిన విలయం నుంచి బాధితులు ఇంకా కోలుకోలేకపోతున్నారు. కడప జిల్లాలో చెయ్యేరు వరద విధ్వంసానికి 24 గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ వార్తలతో తాను ఎంతో వేదనకు గురయ్యనని ఆమె వాపోయారు. ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు.
ఎడతెగని వర్షాలతో కన్నీటి కడలిలా మారిన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల అగచాట్లు చూస్తుంటే గుండె బరువెక్కుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఊళ్ళను ముంచెత్తాయి.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) November 22, 2021
అందులో “పదుల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. ప్రతి పల్లెలో వందలాది మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఎడతెగని వర్షాలతో కన్నీటి కడలిలా మారిన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల అగచాట్లు చూస్తుంటే గుండె బరువెక్కుతోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిలో అయినవారు కళ్ళముందే కొట్టుకుపోయారు. పిల్లా పాపల బేల చూపుల మధ్య… ఏం చెయ్యాలో దిక్కుతోచక స్తంభించిపోయిన ఆ జీవితాలు ఎప్పటికి తేరుకుంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది’’ అంటూ ట్విట్టర్ వేదికగా విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.