Prakash Raj: ’30 వ తేదీన ఇండియాకు వస్తాను..మీ లెక్క ఏంటో తెలుస్తాను’ అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ స్పందన!

'పవన్ కళ్యాణ్ గారు..నేను మాట్లాడింది ఏమిటి?, దానిని మీరు అపార్థం చేసుకొని నాపై ఆపాదిస్తున్నది ఏమిటి?..నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ చేస్తున్నాను, ఈ నెల 30 వ తారీఖున తిరిగి వస్తాను.

Written By: Vicky, Updated On : September 24, 2024 4:08 pm

Prakash Raj

Follow us on

Prakash Raj: తిరుపతి లడ్డు వివాదం రోజు రోజుకి ముదురుతోంది. దేశం లో జరిగే ప్రతీ సంఘటన పై స్పందించే తత్త్వం ఉన్న ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈ అంశంపై మాట్లాడుతూ నేరస్తులను శిక్షించండి, కానీ ఈ సంఘటనను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడం అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించాడు. దీనిపై పవన్ కళ్యాణ్ నేడు జరిగిన ప్రెస్ మీట్ లో చాలా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ ‘హిందువుల మనోభావాలు, సెంటిమెంట్స్ దెబ్బ తినేలా ఒక సంఘటన జరిగితే దాని గురించి మేము మట్లాడకూడదా?, మన ఇంటి మీద ఎవరైనా దాడి చేస్తే పోరాడమా?, ప్రకాష్ రాజ్ గారు అసలు ఏమి మాట్లాడుతున్నారు?, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, అది మీకు కూడా తెలుసు, మత సామరస్యం అంటే అన్ని వైపులా న్యాయం గా ఉండాలి’ అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై ప్రకాష్ రాజ్ కూడా కాసేపటి క్రితమే స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారు..నేను మాట్లాడింది ఏమిటి?, దానిని మీరు అపార్థం చేసుకొని నాపై ఆపాదిస్తున్నది ఏమిటి?..నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ చేస్తున్నాను, ఈ నెల 30 వ తారీఖున తిరిగి వస్తాను. అప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. అప్పటి లోపు నా ట్వీట్ ని మరోసారి జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి ప్లీజ్’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనికి జనసేన శతాగ్ని టీం కూడా వెంటనే స్పందించింది.

వాళ్ళు కౌంటర్ ఇస్తూ ‘ మీ ట్వీట్ ని మేము సరిగానే చూసి అర్థం చేసుకున్నాం. ఉపముఖ్యమంత్రి హోదా లో పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం పై చర్చించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే SIT ని ఏర్పాటు చేసారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధమైన ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతీ ఒక్కరు ముక్త కంఠం తో దీనిని ఖండించాలి. దేశంలో ఎక్కడైనా ఇతర మతాల వారి మీద ఘటనలు జరిగితే సెక్యులరిజం లేదు అని గోల చేసే మీరు, 100 కోట్లకు పైగా ఉన్నటువంటి హిందువుల విశ్వాసాలు దెబ్బతీసిన ఘటనపై స్పందించకుండా ఉండాలంటే ఎలా?.. దేశం లో ఎన్నో గొడవలు ఉన్నాయని అంటున్నారు, వాటిలో మీకు కేవలం ఒక వర్గందే తప్పుగా అన్నట్లుగా కనిపిస్తుంది, కారణాలు మీ రాజకీయ విధానాలు కావొచ్చు, అది మాకు అనవసరం, ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం, మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాము’ అంటూ చెప్పుకొచ్చింది శతాగ్ని టీం. ఇలా ఒకరిపై ఒకరు మంచి గౌరవ మర్యాదలు ఉన్న ఆర్టిస్టులు ఇలా పరస్పరం కౌంటర్లు ఇచ్చుకోవడం అభిమానులకు కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ చిత్రంలో కూడా ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర పోషించాడు.