బాలీవుడ్ హీరోయిన్ ‘నుష్రత్ బరుచా’ ఆసుపత్రిలో జాయిన్ అయిందని వార్త రాగానే ఆమె సన్నిహితులు ఆందోళన చెందారు. అసలు ఆమెకు ఏమైంది ? అంటూ నెటిజన్లు కూడా ఆరా తీశారు. నుష్రత్ విషయంలో ఇంతకీ ఏం జరిగిందంటే.. నుష్రత్ బరుచా ‘లవ్ రంజన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సెట్ లోనే ఆమె ఉన్నట్టుండి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దాంతో షాక్ అయిన ‘లవ్ రంజన్’ టీమ్ సభ్యులు వెంటనే అలర్ట్ అయి హటాహుటిన నుష్రత్ ను ముంబైలోని ‘హిందూజా’ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే, నుష్రత్ కి వచ్చిన సమస్య ఏమి లేదు. 18 రోజులు పాటు విరామం లేకుండా నుష్రత్ షూటింగ్ లో పాల్గొంది. అయితే, రాత్రులు కూడా షూట్ ఉండటంతో ఆమె మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి లోనయింది.
ఈ క్రమంలో ఆ ఒత్తిడి భరించలేక అస్వస్థతకు గురైంది. 20 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుంటే.. నుష్రత్ పూర్తిగా కోలుకుంటుంది అని వైద్యులు తెలియజేశారు. అయితే, తాజాగా ఈ వ్యవహారం పై నుష్రత్ బరుచా మాట్లాడుతూ… కొన్ని నెలలుగా నేను వెర్టిగో సమస్యతో బాధపడుతున్నాను. దాంతో ఉన్నట్టుండి నాకు కళ్లు తిరుగుతాయి. కొన్నిసార్లు నాకు తెలియకుండానే కింద పడిపోతుంటాను.
ఆ సమయంలో నేను చాలా బలహీనంగా అయిపోతాను. ఆ రోజు కూడా నాకు అదే విధంగా జరిగింది, సడెన్ గా నా బీపీ కూడా 65/55 కి పడిపోయింది. ఇక నేను ఆ సమయంలో కనీసం నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. వీల్ చెయిర్ లోనే నన్ను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్ళి జాయిన్ చేశారు’ అంటూ నుష్రత్ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. ఈ అందాల భామకు ఇలాంటి సమస్య ఉండటం చాలా బాధాకరమని నెటిజన్లు కూడా ఫీల్ అవుతున్నారు.