
హీరో నిఖిల్ రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నాడు. గత ఏడాది కరోనా సమయంలో నిఖిల్ పేదలకు తనవంతుగా భారీ సాయం అందించాడు. ఇక ప్రస్తుత కరోనా సెకెండ్ వేవ్ వల్ల కళ్ల ముందే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. వైద్యం అత్యవసరం అనుకున్న వారికీ ఆసుపత్రి బెడ్లు దొరక్క విలవిల్లాడిపోతూ ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి విషమ పరిస్థితులను చూడలేక ఆవేదనతో చలించిపోయాడు నిఖిల్. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనవుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.
వీడియోలో నిఖిల్ మాటల్లోనే.. “కరోనా సెకెండ్ వేవ్ వల్ల షూటింగ్స్ రద్దయ్యాయి. ప్రస్తుతానికి ఈ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు నేను, నా ఫ్యామిలీ మొత్తం బయటకు వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్నాం. ఇక నా ఫ్రెండ్స్ తో కలిసి ఒక టీమ్ ఏర్పాటు చేసుకుని.. సోషల్ మీడియా ద్వారా అవసరమైన చాలామందికి ఆసుపత్రి బెడ్లుతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే ఇంజక్షన్లు అందిస్తూనే, వాళ్ళను ఐసీయూ వార్డులో చేర్పించడం వంటి అత్యవసర సహాయక చర్యలను మా పరిధిలో మేం చేస్తున్నాం’ అని ఎమోషనల్ అవుతూ..
“కానీ మేం చేసే సాయమే కాదు, ఇంకా చాలామంది చేస్తోన్న సాయం కూడా సరిపోవడం లేదు. అంత అధ్వాన్నంగా తయారైంది బయట పరిస్థితి . మన కళ్ల ముందే జనాలు చనిపోవడం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. ఓ కోవిడ్ పేషెంట్ ఆక్సిజన్ బెడ్ కావాలని ఫోన్ చేశాడు. అరగంటలో మేం బెడ్ సమకూర్చి ఫోన్ చేయగా, అప్పటికే అతను చనిపోయాడని చెప్పడం మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. మనల్ని ఎవరు కాపాడరు. రాజకీయ నాయకులకు ఒకర్ని ఒకరు బ్లేమ్ చేసుకోవడమే సరిపోతుంది. వాళ్లు మనల్ని కాపాడలేరు. అయితే జనాలు ఒకరికొకరు సాయం చేసుకోవడం చూస్తుంటే.. మానవత్వం ఇంకా మిగిలే ఉందని అనిపిస్తోంది. ఈ కష్ట కాలంలో అదొక్కటే పాజిటివ్ అంశం. దయచేసి మాస్కులు వేసుకుని జాగ్రత్త వహించండి’ అంటూ నిఖిల్ ఎమోషనల్ అవుతూ చెప్పడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.
Angry… Sad & Helpless looking at the Covid Deaths around us. #Covid19 #CovidIndia #COVIDSecondWave pic.twitter.com/WGd1czgT0Q
— Nikhil Siddhartha (@actor_Nikhil) May 9, 2021