కరోనాతో ఇబ్బందులు పడుతున్న సీని కార్మికులను ఆదుకునేందుకు టాలీవుడ్ చిత్రపరిశ్రమ ముందుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ(కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో చిరంజీవితోపాటు సురేష్ బాబు, ఎన్.శంకర్, కల్యాణ్, దాము ఉంటారు. ఈ సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమలోని కార్మికుల ఆదుకునేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
‘సీసీసీ మనకోసం’ కమిటీకి చిరంజీవి మొదటగా కోటి రూపాయలను ప్రకటించారు. టాలీవుడ్ అగ్రనటుడు కింగ్ నాగార్జున కోటి రూపాయలు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25లక్షలు, మహేష్ బాబు 25లక్షలు విరాళాలను ప్రకటించారు. ఈ ఛారిటీ ద్వారా కార్మికులను ఆదుకునేందుకు తగిన చర్యలను చేపడుతున్నారు. కరోనా నివారణ కోసం ఇప్పటికే మహేష్ రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, జూనియర్ ఎన్టీఆర్ 75లక్షల విరాళాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తాజాగా సీనీ కార్మికుల కోసం మహేష్ బాబు, ఎన్టీఆర్ 25లక్షలు చొప్పున ఇచ్చి కార్మికులకు అండగా ఉంటామని ప్రకటించారు.
కరోనా ప్రభావంతో చిత్రపరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. ఇప్పటికే సినిమా షూటింగ్, థియేటర్ల బంద్ అయ్యాయి. దీంతో చిత్ర పరిశ్రమ రోజు కోట్లలో నష్టపోతుంది. అదేవిధంగా రోజువారి సీని కార్మికులకు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ మనకోసం’ సంస్థ ఆవిర్భావించింది. దీని ద్వారా కార్మికులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.