తెలుగు సినిమాని నాగిరెడ్డి, చక్రపాణి వంటి దిగ్గజాలు శాసిస్తోన్న రోజులు అవి. కాకపోతే, చక్రపాణిలో ఉన్న సినిమా రచయిత పై విమర్శలు ఎక్కువ అయిన రోజులు కూడా అవే. తన చేతుల్లోనే తెలుగు సినిమా వర్ధిల్లుతుంది అన్నట్టు చక్రపాణి తానే కథలు రాయడం మంచి పద్దతి కాదు అని అప్పటి విమర్శకులు నిత్యం పెదవి విరుస్తూ ఉండేవారు. దీనికితోడు చక్రపాణి ఒక కథ రాస్తే.. ఎవరు ఏమన్నా ఆ కథతోనే సినిమా తీయాలనే వారు.
‘మిస్సమ్మ’ కథ విషయంలో కూడా ఇదే తంతు. యాభై యేళ్ళ కిందట ప్రేమ కథ ఎలా ఉండాలి ? కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకుని చూసుకోవడం గొప్ప సాహసోపేత నిర్ణయం అన్నట్టు కథ సాగాలి కదా. కానీ మిస్సమ్మ అల కాదు. ఒక పెళ్ళి కాని అమ్మాయి సరిగా పరిచయమైన లేని ఒక పరాయి అబ్బాయిని నమ్మి అతనికి భార్యగా వేరే ఊరు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. పైగా నెలల తరబడి పెద్దగా పరిచయం లేని ఆ కుర్రాడికి భార్య ఉంటుంది. నిజమే.
ఇదే పాయింట్ ఇప్పుడు చెప్పినా ‘ఏంటయ్యా ఇంత సినిమాటిక్ గా ఉంది’ అంటారు. కానీ ఇదే సినిమాటిక్ పాయింట్ తో క్లాసిక్ సినిమా తీశారు చక్రపాణి. నిజానికి నిర్మాత నాగిరెడ్డికి అసలు ‘మిస్సమ్మ’ మీద ఎలాంటి నమ్మకం లేదు. ఇలాంటి నమ్మశక్యం కానీ కథతో సినిమా చేస్తే నష్టాలు గ్యారంటీ అని ఆయన బలంగా నమ్మారు. కానీ చక్రపాణి స్నేహం కోసం ఆయన ‘మిస్సమ్మ’ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు.
అన్నిటికి మించి అనేక క్లిష్ట పరిస్థితుల్లో, అనేక అపనమ్మకాలు, విమర్శలతో విడుదలైన ‘మిస్సమ్మ’ సినిమా నేటికీ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఆ రోజుల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చాల ఆలోచించారు. అప్పటి సినీ ప్రముఖులు అందరూ ఈ సినిమా ఆడదు, ఇక పక్కన పెట్టేయండి అని ముక్త కంఠంతో చెప్పారు. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఎంతో ప్రజాదరణ పొందింది. ఇప్పటికీ అజరామరంగా నిలిచిపోయింది. విమర్శలు చేసిన సినీ ప్రముఖులకు కళ్ళు తెరిపించింది.