Brahmanandam : బ్రహ్మానందం (Brahmanandam).. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన కామెడీ చేయాల్సిన అవసరం లేదు. తెరమీద ఒక్క ఎక్స్ ప్రెషన్ ఇస్తే చాలు నవ్వులు పూయడం ఖాయం. ఆయన సినీ కెరీర్లో దాదాపు 1260సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులలో తన పేరు ఎక్కించుకున్నారు. బ్రహ్మానందం తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించడమే కాదు.. తన నటనతో ఏడిపించగలరు కూడా దీని ఉదాహరణ 90లలో వచ్చిన బాబాయ్ హోటల్ సినిమా. తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రంగమార్తాండ సినిమా. ఈ చిత్రాలు ఆయనలోని మరో నటుడిని తట్టి లేపాయి. అయితే తాజాగా బ్రహ్మానందం తన కొడుకుతో కలిసిన నటించిన ‘బ్రహ్మ ఆనందం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనిలో ఆయనలోని మరో యాంగిల్ ను చూసి అభిమానులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు. దీంతో ఆయనకు హాస్యబ్రహ్మ అన్న బిరుదు ఊరికెనే ఇవ్వలేదు.. తనో లెజెండ్రీ యాక్టర్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం తన పెద్ద కొడుకు గౌతమ్ రాజా (Gautham Raja) తో కలిసి ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమా చేశారు. ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా రంగమార్తాండ సినిమా టైంలో జరిగిన ఒక సంఘటనను గౌతమ్ రాజా బయటపెట్టారు. తను ఈవెంట్లో బ్రహ్మానందం నటనా విషయంలో ఎంత డెడికేటెడ్ గా ఉంటారో మరోసారి వివరించారు. గౌతమ్ రాజా మాట్లాడుతూ..‘‘మా నాన్న నాకు నటుడిగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే రంగమార్తాండ సినిమాలోని ఓ సీన్లో తన భార్య చనిపోతే ఏడిచే సీన్ ఉంటుంది. రోజు భోజనానికి ఇంటికి వచ్చే ఆయన.. మా ఇంటికి తినడానికి రాలేదు. అమ్మని అడిగితే ఏమో తినను అని చెప్పారు అని నాతో చెప్పింది. ఇక నేను వెళ్లి నాన్నను ఎందుకు తినడానికి రానన్నారంట ఏమైంది అని అడిగితే.. రేపు షూటింగ్లో ఒక సన్నివేశం ఉంది రా. ఆ సన్నివేశంలో చాలా వీక్ గా నేను కనిపించాలి. ఇవాళ అంతా తినకపోతే రేపు ఆ నీరసం అనేది ముఖంలో కనిపిస్తుంది. దీంతో ఆ సీన్ చాలా ఎలివేట్ అవుతుంది కదా అందుకే తినలేదు అంటూ చెప్పారు” అని గౌతమ్ రాజా తెలిపారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఆయన ఏంటనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ వయసులో కూడా నటన కోసం తాను ఎంత కష్టపడుతున్నారంటే.. యాక్టింగ్ పట్ల ఎంత డెడికేటెడ్ గా పనిచేస్తున్నారో అర్థమవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హీరో గౌతమ్ రాజా విషయానికి వస్తే పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత చాలా చిత్రాలలో నటించినా.. పెద్దగా ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయారు. ఇప్పుడు చాలాకాలం తర్వాత తన తండ్రితో కలిసి ‘బ్రహ్మ ఆనందం’ సినిమాతో వచ్చారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో గౌతమ్ రాజాకు ఇండస్ట్రీలో మళ్ళీ వరుస ఛాన్స్ లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక బ్రహ్మానందం ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు.