RK Roja  : మల్లెమాల సంస్థ నో చెప్పిందా? చెన్నై అవకాశాల కోసం రోజా వెతుకులాట!

వైసీపీలో ఆర్కే రోజా ఫైర్ బ్రాండ్. జగన్ పై ఈగ వాలితే.. ఇట్టే ఫైర్ అయ్యేవారు. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. తన దూకుడుతో రాజకీయాల్లో రాణించిన రోజా.. ఇప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : August 4, 2024 4:03 pm
Follow us on

RK Roja : సినీ రంగం నుంచి రాజకీయాల్లో రాణించారు ఆర్కే రోజా. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం సాగిన ఆమె తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా మాత్రం వ్యవహరించ గలిగారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావించిన ఆమెకు టిడిపిలో ఆ అవకాశం దక్కలేదు.అందుకే వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు.మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత ఆమె కనిపించకుండా పోయారు.అధికారంలో ఉన్న రోజుల్లో యాక్టివ్ గా పని చేసిన ఆమె.. ఇప్పుడు చెన్నైకి పరిమితం అవుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ల వ్యవహారం, ఇతరత్రా అంశాల్లో కేసులు చుట్టుముట్టే అవకాశం ఉంది.అందుకే ఆమె ఏపీలో ఉండడం లేదు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఆమె.. అప్పుడప్పుడు నగిరి వచ్చి వెళ్ళిపోతున్నారు.ఓడిపోయిన తర్వాత వైసీపీ శ్రేణుల సమావేశం కూడా నిర్వహించలేకపోయారు. సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకత ఉంది.ఆపై కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో స్థానికంగా ఉంటే ఇబ్బందులు తప్పవని ఆమె భావిస్తున్నారు.అందుకే చెన్నైకి మకాం మార్చారు. అక్కడే సినీ, టీవీ రంగాల్లో అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితి ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. అయితే గతంలో ఆమె కెసిఆర్ కు అనుకూలంగా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే తెలుగు టీవీ పరిశ్రమలో ఆమెకు అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు. అందుకే కన్నడం తో పాటు తమిళంలో బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆమె సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఓ రెండు టీవీ చానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో హోస్ట్ గా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త సినీ దర్శకుడు కావడంతో.. ఆ రెండు చిత్ర పరిశ్రమల్లో కొన్ని సినిమాల్లో నటించేందుకు రోజా సిద్ధపడుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ఆమె తెలుగు సినీ పరిశ్రమకు, వైసీపీ రాజకీయాలకు దూరమైనట్టే.

* జబర్దస్త్ జడ్జిగా
గతంలో ఈటీవీ జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించారు. సుదీర్ఘకాలం ఆ షోలో కొనసాగారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా జడ్జిగా కొనసాగగా.. మంత్రిగా ఎంపికైన తర్వాత మాత్రం ఆ షోలను విడిచి పెట్టాల్సి వచ్చింది. ఆమె తరువాత జడ్జిలుగా ఇంద్రజ, కుష్బూ, కృష్ణ భగవాన్ లాంటివారు నిలదొక్కుకున్నారు. అందుకే మల్లెమాల సంస్థను రోజా ఆశ్రయించిన పెద్దగా వారు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

* నాగబాబుతో కలిసి జర్నీ
నాగబాబు తో కలిసి సుదీర్ఘకాలం జబర్దస్త్ జడ్జిగా కొనసాగారు ఆర్కే రోజా. అయితే ముందుగా నాగబాబు బయటకు వెళ్లిపోయారు. దీంతో అన్నీ తానై వ్యవహరించారు రోజా. మంత్రిగా పదవి రావడంతో షో లకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అయితే రాజకీయాల్లో వివాదాస్పదురాలిగా మారడంతో మల్లెమాల సంస్థ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆమె ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానళ్ల లో ప్రయత్నాలు చేస్తున్నా.. అక్కడ మెగా కుటుంబం హవా నడుస్తోంది. ఆ కుటుంబ సభ్యులపై రోజా గతంలో చాలా రకాలుగా ఆరోపణలు చేశారు. ఆ ప్రభావం ఇప్పుడు ఆమెపై పడుతోంది.

* అవకాశాల కోసం వెతుకులాట
ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉంటూ సినిమాతో పాటు టీవీ ఛానల్లో అవకాశం కోసం తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త తమిళ దర్శకుడు కావడంతో.. సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు చానల్స్ సైతం ఆమెను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే వైసీపీలో కానీ, రాష్ట్ర రాజకీయాల వైపు కానీ ఆమె చూడకపోవడం విశేషం. ఒకవేళ వైసీపీ పూర్వవైభవానికి దిశగా రాకపోతే రాజకీయాలకు దూరమైనా.. ఆశ్చర్య పడాల్సిన పనిలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.