Dhootha Season 2 Story: వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎగురుకుంటూ వస్తున్న సమయంలో నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కి భారీ విజయాన్ని అందించిన వెబ్ సిరీస్ ‘దూత'(Dootha). మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్(Vikram K Kumar) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ హారర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. అప్పటి వరకు హారర్ జానర్ లో ఎన్నో సినిమాలు చూశాము, ఎన్నో వెబ్ సిరీస్ లు కూడా చూశాము, కానీ ఇలాంటి సరికొత్త ఐడియా తో ఒక వెబ్ సిరీస్ రావడం మాత్రం ఈమధ్య కాలం లో ‘దూత’ విషయం లోనే జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారుగా 8 నెలల పాటు టాప్ టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది అంటేనే ఏ రేంజ్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.
వెబ్ సిరీస్ గా కాకుండా, ఈ ఐడియా తో సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఉండుంటే నాగ చైతన్య కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ కి సీక్వెల్ ఉంటుందని ‘దూత’ క్లైమాక్స్ లోనే ఆడియన్స్ కి ఒక హింట్ ఇచ్చాడు డైరెక్టర్ విక్రమ్. ఇప్పుడు ఆ సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యిందట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా రీసెంట్ గానే మొదలు పెట్టారని, ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుండి నాగ చైతన్య ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ సీజన్ కథ విషయానికి వస్తే, మొదటి సీజన్ చివర్లో సాగర్(నాగ చైతన్య) తాను చేసిన తప్పులను పూర్తిగా తెలుసుకొని మారినప్పటికీ, ఆ శాపం ఇంకా వీడలేదని డైరెక్టర్ ఒక హింట్ ఇచ్చాడు. ఈసారి కథ కేవలం నాగ చైతన్య చుట్టూనే తిరగదు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్రాంతి షెనాయ్ (పార్వతి తిరవోతు) చుట్టూ కూడా ఈ కథ తిరగనుంది.
ఆమె ఇన్వెస్టిగేషన్ లో ఎదురుకునే మిస్టరీలను కూడా ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారు. ఇది ఇలా ఉండగా మొదటి సీజన్ ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శరత్ మరార్ నిర్మించాడు. కానీ ఇప్పుడు రెండవ సీజన్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించబోతుందట. నాగ చైతన్య ఈసారి సొంత బ్యానర్ లో పనిచేయబోతున్నాడు అన్నమాట. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దర్శకత్వంలో నాగ చైతన్య ‘వృష కర్మ’ అనే మిస్టిక్ జానర్ సినిమాని చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం విడుదల కానుంది.
