Karimnagar Municipal Corporation: తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన జిల్లాగా పేరుపొందింది కరీంనగర్. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్నప్పుడు అనేక రకాలుగా కరీంనగర్ జిల్లా పేరు వినిపించేది. కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీ కి పెట్టని కోట లాంటిది. ఈ ప్రాంతంలో గులాబీ పార్టీ కి చెందిన అభ్యర్థులు అనేక పర్యాయాలు ఎమ్మెల్యేలుగా.. ఎంపీలుగా విజయాలు సాధించారు. పురపాలక ఎన్నికల్లో.. స్థానిక ఎన్నికలలో కూడా గులాబీ పార్టీ ఘన విజయాలు సాధించారు. ఎంతో కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయం మీద గులాబీ జెండా ఎగురవేశారు.
2020లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ పూర్తిగా గులాబీ రంగును అద్దుకుంది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు గులాబీ పార్టీకి ప్రతిబంధకంగా మారాయి. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ కేంద్రమంత్రి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో.. ఆయన కూడా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు గులాబీ పార్టీ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రచారం సాగిస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. డివిజన్లలో చాలావరకు త్రిముఖ, చతుర్ముఖ పోటీ ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు వంటి వారు తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం సాగిస్తున్నారు. గులాబీ పార్టీ నుంచి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ప్రతి డివిజన్లో 4 నుంచి 5000 మంది వరకు ఓటర్లు ఉన్నారు. మొత్తం కరీంనగర్లో 66 డివిజన్లకు గాను 398 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇలా ఎవరికి వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గులాబీ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రచారం కనిపించడం లేదు. బిజెపి నుంచి బండి సంజయ్ మాత్రమే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం.. తుమ్మల నాగేశ్వరరావు.. శ్రీధర్ బాబు ప్రచారంలో ముందు వరుసలో ఉండడంతో.. అధికార కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తోంది. అయితే ఇది చివరి వరకు ఉంటుందా? గులాబీ పార్టీ సత్తా చూపిస్తుందా? కమలం పార్టీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం ఫిబ్రవరి 13న తేలుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కరీంనగర్లో హుజురాబాద్, చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, సిరిసిల్ల ఇలా ఆరు మున్సిపాలిటీలలో మొత్తం పీఠాలను మహిళలకు కేటాయించారు. హుజరాబాద్ ఎస్సీ, చొప్పదండి ఎస్సీ, జగిత్యాల బీసీ, కోరుట్ల జనరల్, ధర్మపురి జనరల్, సిరిసిల్ల జనరల్ కు కేటాయించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తం 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. రకంగా వారు గెలుపు నిర్నేతలుగా మారిపోయారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలుపుకుంటే మొత్తం 126 డివిజన్లు, 341 వార్డులలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ప్రాంతాల్లో మొత్తం మహిళా ఓటర్లే అధికంగా ఉండడం విశేషం.
కరీంనగర్ నగరంలో ప్రస్తుతం బిజెపి వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. బండి సంజయ్ అన్ని తానై నడిపిస్తున్నారు. అయితే అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి అర్ధాంగ బలాల సామర్థ్యం ఉంది. జనాలు కూడా కాంగ్రెస్ వైపే చాలామంది మొగ్గు చూపుతున్నారు. పథకాలు, కాలనీ సమస్యలు ఇతరత్రా అవసరాలు కాంగ్రెస్ తోనే నెరవేరుతాయని జనాలు బలంగా నమ్ముతున్నారు. దీంతో బిజెపి కంటే కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ వైపే గాలి వీస్తోంది. బండి సంజయ్ ఎంత ప్రచారం చేసినా. కేంద్రాల నుంచి నిధులు తెస్తానన్నా.. గడిచిన 5 ఏళ్లలో ఆయన చేసింది శూన్యం. ప్రధాన రోడ్లు బాగానే ఉన్నా.. కాలనీలోకి వెళ్తే మురికి కాలువలు ఇప్పటికీ పూర్తికాలేదు. అంతర్గత రహదారులు నిధుల సమస్యతో ఎక్కడికక్కడే నిలిచిపోయి గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్లలో చేయని బండి సంజయ్ బిజెపిని కాలనీలోని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఓవరాల్ గా కార్పొరేషన్ లో కాంగ్రెస్ వర్సెస్ బిజెపి పరిస్థితి ఉన్న కొంచెం కాంగ్రెస్ కే మొగ్గు కనిపిస్తోంది. అధికార పార్టీ డబ్బులు కూడా బాగా ఖర్చు పెడుతుండడంతో అందరూ అటువైపే చూస్తున్నారు. ఇక ఇద్దరి పోరులో బి ఆర్ ఎస్ అసలు అక్కడ కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగర ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో బిజెపికి అవకాశాలు ఉన్నాయి.
