Chiru, Mohan babu: తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ సర్కారు సహాయం చేయడం సంగతి అటుంచితే.. ఊహించని నిర్ణయాలతో షాకులు ఇచ్చింది. కరోనా కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి.. టికెట్ల రేట్లు తగ్గించి గట్టిషాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పించి, గండం గట్టెక్కించుకోవాలని సినీ ప్రముఖులు చూస్తుండగానే.. ఏకంగా టిక్కెట్ల అమ్మకాన్నే తమ చేతుల్లోకి తీసుకుంటామంటూ సర్కారు ప్రకటించడంతో సినీ పెద్దల గుండెల్లో బండపడింది. ఈ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవదానికి సినీ ప్రముఖులకు పిలుపు వచ్చింది. చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా గుర్తించిన ప్రభుత్వం.. ఆయనకే సమాచారం చేరవేసింది. అయితే.. మా ఎన్నికల నేపథ్యంలో పరిస్థితులు మారిపోయాయి. మరి, ఇప్పుడు సర్కారు వద్దకు చిరు వెళ్తారా? మోహన్ బాబు వెళ్తారా? అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలు చెప్పుకోవడానికి.. ఏపీ సర్కారు సినీ ప్రముఖులకు ఆ మధ్యనే ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి పేర్ని నాని చిరంజీవికి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో.. పలువురు సినీ ప్రముఖులు సమావేశమై.. సమస్యల చిట్టాను సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత మంత్రి కూడా హైదరాబాద్ వచ్చి, చిరంజీవిని కలిసి వెళ్లారు. కానీ.. మీటింగ్ జరగలేదు.
ఆ తర్వాత మా ఎన్నికలు వచ్చాయి. అందులో మెగా ఫ్యామిలీ బలపరిచిన ప్రకాశ్ రాజ్ ఓటమి పాలయ్యారు. మంచు విష్ణు గెలిచాడు. పైగా.. సీఎం జగన్ కు వీళ్లు బంధువులు కూడా. దీంతో.. ఇప్పుడు టాలీవుడ్ సమస్యలను వివరించేందుకు ప్రభుత్వం వద్దకు ఎవరు వెళ్తారు అన్నది ఆసక్తిగా మారింది.
మా ఎన్నికల తర్వాత విష్ణు మాట్లాడుతూ.. త్వరలోనే ఇద్దరు సీఎం ల వద్దకు వెళ్లి, సమస్యలు చెప్పుకుంటామన్నాడు. అటు మోహన్ బాబు.. దాసరి తోనే పెద్దరికం పోయిందని అన్నారు. ఇప్పుడు మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని నరేశ్ వ్యాఖ్యానించారు కూడా. మరి, ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం వద్దకు ఎవరు వెళ్తారు? ఏపీ సర్కారు ఎవరిని పిలుస్తుంది? అన్నది కీలకంగా మారింది.