Child Murder : హైదరాబాద్ లోని సైదాబాద్ పరిధిలో ఉన్న సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ ఘటనను యావత్ దేశం ఖండిస్తోంది. అభంశుభం తెలియని చిన్నారిని మానవ మృగం బలిగొన్న తీరు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) కుటుంబ సభ్యులను ఓదార్చగా.. తాజాగా గబ్బర్ సింగ్ టీమ్ (Gabbar sing team) బాధితులను కలిశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముక్కుపచ్చలారని చిన్నారిపై ఇంత దారుణం జరిగిన సంగతి తెలిసి ఎంతో బాధపడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దారుణానికి పాల్పడిన వాడు మగజాతినే తల దించుకునే విధంగా చేశాడని మండిపడ్డారు. ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్ లో కొనసాగకుండా ఉండాలంటే.. దుబాయ్ మాదిరి శిక్షలను ఇక్కడ అమలు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే.. ఈ తరహా నేరాలకు పాల్పడేవాళ్లకు భయం ఉంటుందని అన్నారు.
తాము బతుకుదెరువు కోసం సినిమాల్లో రౌడీ వేషాలు వేస్తామని, ఇలాంటి ఘటనలు చూసినప్పుడు నిజంగానే అలా మారిపోయి, దుర్మార్గులను శిక్షించాలని అనిపిస్తుందని ఉద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వం మాకు అధికారం ఇస్తే.. నిందితుడిని తామే ఉరి తీస్తామని, అవసరమైతే జైలుకు వెళ్లినా పర్వాలేదని అన్నారు. దోషిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ దారుణ సంఘటనను తాము పవన్ కల్యాణ్(pawan Kalyan) దృష్టికి తీసుకెళ్లామని గబ్బర్ సింగ్ బృంద సభ్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వార్తలను ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని చెప్పారు. తాము స్వయంగా కలిసి ఈ విషయం చెప్పినప్పుడు పవన్ కల్యాణ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని చెప్పారు. చాలా ఎమోషన్ అయిన పవన్.. కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు.
ఇదిలాఉంటే.. పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందించాలని చిన్నారి బంధువులు సోషల్ మీడియాలో కోరడం సంచలనంగా మారింది. అయ్యా పవన్ కల్యాణ్ గారు ఈ ఘటనపై స్పందించండి, మాకు మద్దతుగా ఉండండి అని వారు కోరారు. ఈ మేరకు ట్విటర్ లో ట్వీట్ చేశారు. దీంతో.. ఈ పోస్టు వైరల్ గా మారింది. మరి, దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.