కరోనా వలలో పడి చేప పిల్లలా విలవిల్లాడుతున్న తెలుగు సినిమా రంగం మళ్లీ మామూలు పరిస్థితికి ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. ఏప్రిల్ 14 వరకు ఉన్న లాక్ డౌన్ను మరికొంత కాలం కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తేసినా.. వెంటనే థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు అనుమతులిస్తారో లేదో తెలియదు.
ఒకవేళ అనుమతులిచ్చినా. మునుపటిలా సినిమాల ప్రదర్శన ఉండదన్నది తేట తెల్లం అవుతోంది. థియేటర్లలో సీటు కి సీటు కి మధ్య ఖాళీ వదలడం , శానిటైజేషన్ కోసం..థియేటర్ సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు తప్పనిసరి చేయడం తో పాటు ప్రేక్షకులకు జ్వరం లాంటి పరీక్షలు చేయడానికి థర్మామీటర్ల వంటి వాటి కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. థియేటర్ యాజమాన్యం ఇంత చేసినా జనాలు వెంటనే థియేటర్లకు రావడం కష్టమే.
ఆ కోణం లో ఆలోచిస్తే మామూలు రోజుల్లో వచ్చే కలెక్షన్ లో సగం అయినా వస్తుందా అన్నది సందేహమే. అలాంటి స్థితిలో సినిమా థియేటర్లు తెరుచుకున్నాక తొలి రెండు నెలల్లో సినిమాలకు కష్ట కాలం దాపరించి నట్లే .. ఇలాంటి సంక్లిష్ట సమయంలో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ఏ నిర్మాత ముందుకొస్తారో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఏప్రిల్ 15 న లాక్ డౌన్ పూర్తయే సమయానికి నాని నటించిన `వి ‘ సినిమా తో పాటు , మెగా మేనల్లుడి `ఉప్పెన’ , రానా నటించిన `అరణ్య’ , రామ్ నటించిన ` రెడ్ ‘, రాజ్ తరుణ్ నటించిన `ఒరేయ్ బుజ్జిగా’ లాంటి సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ పొజిషన్ లో ఉన్నాయి. రాబోయే కాలంలో లాక్ డౌన్ ఎత్తేసి సినిమా థియేటర్లు తెరుచుకున్నా రెవెన్యూ బాగా తక్కువ వచ్చే అవకాశ ముంది అలాంటి నేపథ్యంలో ఈ చిన్న సినిమాల్ని థియేటర్ లలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు మొగ్గు చూపుతారా లేదా ఆన్ లైన్ స్ట్రీమింగ్ కి మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాలి.