Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్ ను బోనీకపూర్ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? కారణమేంటి?

శ్రీదేవి వయసు పెరిగాక లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో గృహిణి పాత్రలు చేసింది. తన ఏజ్ కి ఇమేజ్ కి సెట్ అయ్యే చిత్రాలు చేసింది. అనూహ్యంగా 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్ లో ప్రమాదవశాత్తు మరణించింది.

Written By: S Reddy, Updated On : April 4, 2024 6:17 pm

Sridevi Biopic

Follow us on

Sridevi Biopic: నటి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. కొందరు ఫిల్మ్ మేకర్స్ ఆ దిశగా ప్రయత్నాలు చేశారు కూడా. అయితే శ్రీదేవి భర్త బోనీ కపూర్ మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. అందుకు కారణాలు ఏమిటో చూద్దాం.. తమిళనాడులో పుట్టిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. టీనేజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయం, నాట్యం కలగలిపిన శ్రీదేవి కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇరవై ఏళ్ళు వచ్చే నాటికే సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. అనంతరం ఆమె కన్ను బాలీవుడ్ పై పడింది.

అప్పట్లో బాలీవుడ్ అతిపెద్ద పరిశ్రమ. అక్కడ హీరోయిన్ గా సక్సెస్ అయితే ఇండియా వైడ్ ఫేమ్ వస్తుంది. అలాగే భారీగా రెమ్యూనరేషన్ తెలుసుకోవచ్చు. ఈ ఆలోచనతో హిందీ చిత్ర పరిశ్రమ మీద దృష్టి పెట్టింది. అక్కడ కూడా తన హవా నడిచింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ కి వెళ్ళాక సౌత్ లో ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. ఏళ్ల తరబడి టాప్ పొజిషన్ లో ఉంది. నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకున్న శ్రీదేవి ఇద్దరు అమ్మాయిలకు తల్లి అయ్యింది. వాళ్ళ పేర్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్.

శ్రీదేవి వయసు పెరిగాక లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో గృహిణి పాత్రలు చేసింది. తన ఏజ్ కి ఇమేజ్ కి సెట్ అయ్యే చిత్రాలు చేసింది. అనూహ్యంగా 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్ లో ప్రమాదవశాత్తు మరణించింది. బాత్ టబ్ లో స్పృహతప్పి పడిపోయిన శ్రీదేవి ఎవరూ గమనించకపోవడంతో చనిపోయారు. ఆమె మరణం తర్వాత శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించాలనే వాదన తెరపైకి వచ్చింది. కానీ బోనీ కపూర్ అందుకు అంగీకరించడం లేదు.

తాజాగా ఆయన దీనిపై స్పందించారు. శ్రీదేవి చాలా ప్రైవేట్ గా ఉంటారు. ఆమె జీవితం కూడా ప్రైవేట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను బ్రతికి ఉన్నంత వరకు శ్రీదేవి బయోపిక్ కి అనుమతి ఇవ్వను అన్నారు. కాగా శ్రీదేవి జీవితంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆమె నటుడు మిథున్ చక్రవర్తిని రహస్యంగా వివాహం చేసుకున్నారనే వాదన ఉంది. ఈ విషయాన్ని మిథున్ చక్రవర్తి ఒకసారి ధృవీకరించారు. ఇలాంటి వివాదాలతో శ్రీదేవి కీర్తికి భంగం కలుగుతుందని బోనీ కపూర్ భవిస్తూ ఉండవచ్చు. అలాగే ఆమె మరణం కూడా మిస్టరీగా ఉంది..