Unstoppable Show: నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ సరికొత్త షోను నిర్వహించింది. గురువారం తొలి ఎపిసోడ్ విడుదలైంది. ఇందులో మోహన్ బాబు తొలి గెస్ట్గా పాల్గొన్నారు. ఇందులో బాలయ్య, మోహన్ బాబు మధ్య లోతైన చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే చిరంజీవి, ఎన్టీఆర్, చంద్రబాబు ఇలా అనేక విషయాలపై చర్చించారు. మరోవైపు తనకు మద్యం అలవాటు ఉన్న విషయంపైనా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం.

షో జరుగుతున్న క్రమంలో చంద్రబాబు గురించి స్పందించిన మోహన్బాబు.. చంద్రబాబు మాట విని అన్నయ్య(ఎన్టీఆర్)ను కాదని వచ్చానని తెలిపారు. ఆ తర్వాత స్నేహితుడు రజనీకాంత్తో కలిసినప్పుడు.. అన్నయ్య మోహన్బాబు నువ్వు కూడానా అని అన్నారని.. ఆ సమయంల తననోట ఒక్క మాట కూడా రాలేదని బాధపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు తనకు క్రమశిక్షణ లేదని చంద్రబాబు పార్టీ నుంచి బయటకు పంపినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తర్వాత మీరెందుకు తెదేపా పగ్గాలు చేపట్టలేదని మోహన్ బాబు బాలయ్యను ఎదురు ప్రశ్న అడిగారు. ఆ సమయంలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో తాను పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే వంశపారంపర్య రాజకీయాలు చేస్తే బాగోదని పార్టీ అనేది ప్రజల కోసం అవ్వాలి కానీ కుటుంబం కోసం కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబుకు అప్పగించినట్లు బాలయ్య తెలిపారు. చంద్రబాబు కూడా పంచాయితీ స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తిగా తెలిపారు. ఇక మద్యం సేవించే అలవాటుపై మోహన్బాబు మాట్లాడుతూ..మద్రాసులో ఉన్న రోజుల్లో కోడంబాకం బ్రిడ్జ్ కింద సారా దుకాణాలు ఉండేవని అన్నారు. ఒక స్నేహితుడితో కలిసి వెళ్లి అక్కడ సారా తాగేవాడినని.. ఆ విధంగా జీవితం ప్రారంభమై, డబ్బు లేని రోజుల్లోనూ తాగడం ఆగలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మంచి విస్కీ తాగుతున్నాని సరదా నవ్వుతో అన్నారు.