Lok Sabha Election 2024: సార్వత్రిక ఎన్నిల్లో భాగంగా పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేక మెనూ ప్రకటించింది. గతంలోనూ సిబ్బందికి ఈసీ భోజన ఏర్పాట్లు చేసేది. కానీ, ఎప్పుడూ ఇలా మెనూ ప్రకటించలేదు. మొదటిసారి సిబ్బందికి ఎలాంటి ఆహారం ఇవ్వాలనేది కూడా ఈసీ నిర్ణయించింది.
వేసవి నేపథ్యంలో సమతుల ఆహారం..
ఎండల తీవ్రత పెరిగింది. వడగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బందికి బలవర్ధకమైన సమతుల ఆహారం అందించాలని ఈసీ నిర్ణయించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకే ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం(మే 13న) నిర్వహించే ఎన్నికల పోలింగ్ నిర్వహించే సిబ్బందికి సబంధించిన మెనూ ప్రకటించింది.
మెనూ ఇలా…
పోలింగ్కు ముందు రోజు అంటే ఆదివారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య సిబ్బందికి భోజనం(అన్నం ,కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ) అందిస్తారు. ఇక సోమవారం(మే 13న) ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటిపండ్లు, 8 నుంచి 9 గంటల మధ్య క్యారెట్, టమాటాతో కూడిన ఉప్మా, పల్లీల చట్నీ అందిస్తారు. 11 నుంచి 12 గంటల మధ్య మజ్జిగ పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు భోజన(కోడిగుడ్డు కూర, ఓ కూరగాయ, చట్నీ, సాంబారు, పెరుగు) అందిస్తారు. మళ్లీ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య మజ్జిగ లేదా నిమ్మరసం పంపిణీ చేస్తారు. సాయంత్రం 5 గంటలకు టీ, బిస్కెట్లు అందిస్తారు. ఈ ప్రక్రియను పంచాయతీ అధికారులు, పురపాలికల్లో ప్రత్యేకంగా నియమించిన వారు పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించారు.