TSPSC Group 1 Prelims: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9 నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది.
కొత్త నోటిఫికేషన్..
గత ప్రభుత్వం 2022లో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటì ఫికేషన్ ఇచ్చింది. అయితే పరీక్ష నిర్వహణలో నాటి టీఎస్పీఎస్సీ విఫలమైంది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రెండుసార్లు పరీక్ష రద్దయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాత నోటిఫికేషన్ రద్దు చేసింది. టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది.
4.03 లక్షల దరఖాస్తులు..
563 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు, మూల్యాంకన సిబ్బంది నియామకం, బాధ్యతలపై కలెక్టర్లు, ఎస్సీలతో టీఎస్పీఎస్సీ చైర్మన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాలతో న్యాయ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ప్రిలిమ్స్ రద్దయింది. ఈ నేపథ్యంలో ఈసారి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. నిబంధనలు పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఓఎంఆర్ పద్ధతిలో ప్రిలిమ్స్..
గ్రూప్–1 ప్రిలిమ్స్ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం అందించింది. వెబ్సైట్లో వివరాలు కూడా పేర్కొంది. ఈ పరక్షీను ఓఎంఆర్ లేదా సీబీఆర్టీ(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని, దీనిపై కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని నోటిఫికేషన్లోనే పేర్కొంది. భారీగా దరఖాస్తులు రావడంతో సీబీఆర్టీ విధానంతో అయితే సెషన్ల వారీగా నిర్వహించాల్సి వస్తుందని భావించిన టీఎస్పీఎస్సీ ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది.
షెడ్యూల్ ప్రకారం పూర్తి..
గ్రూప్–1 నియామకాలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు టీఎస్పీఎస్సీ ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని ప్రనకటించింది. ప్రధాన పరీక్షలు అక్టోబర్ 21న ప్రారంభమవుతాయని తెలిపింది. దీంతో ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు మెయిన్స్కు సిద్ధమయ్యే వీలు కలుగుతుంది. మెయిన్స్ పరీక్షలు మొత్తం 6 పేపర్లలో జరుగుతాయి. మరోవైపు గతంలో ఇచ్చిన జీవో 55కు కమిషన్ సవరణ చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను జోన్ల వారీగా పోస్టుల సంఖ్యకు అనుగునంగా 1:50 నిష్పత్తి ప్రకారం మెయిన్స్కు ఎంపిక చేస్తారు. రిజర్వుడ్ వర్గాల్లో అబ్యర్థుల సంఖ్య తక్కువైతే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్ రాసేవారికి సూచనలు..
మరోవైపు ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేస్తూ టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ జారీ చేసింది. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ పత్రాలు అందిస్తామని వెల్లడించింది. పరీక్ష సమయంలో వేలిముద్ర, ఫొటో బయోమెట్రిక్ తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వనివారిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఈ బయోమెట్రిక్ను నియామక ప్రక్రియలో వివిధ దశల్లో ధ్రువీకరించుకుంటామని పేర్కొంది.
మరికొన్ని సూచనలు..
– అభ్యర్థులకు పరీక్ష రోజు హాల్టికెట్ నంబర్, ఫొటో, పేరు, తండ్రి, తల్లి పేర్లు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, జెండర్ వివరాలు ముద్రించిన ఓఎంఆర్ జవాబు పత్రం అందిస్తారు. ఇందులో తప్పులు ఉంటే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి సాదా ఓఎంఆర్ షీట్ తీసుకోవాలి.
– పరీక్ష రాసేముందు బుక్లెట్ నంబర్ ఓఎంఆర్షీట్లో నమోదు చేసి, సర్కిళ్లను జాగ్రత్తగా బబుల్ చేయాలి. జవాబు పత్రంలో పేర్కొన్నచోట అభ్యర్థి, ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. జవాబులు గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్పెన్ ఉపయోగించాలి.
– పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను స్కానింగ్చేసి అభ్యర్థుల డిజిటల్ కాపీలు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ప్రశ్నపత్రంలో ఇంగ్లిష్ పదాలు, వ్యాక్యాల అర్తం తెలుగులో సరిగా అనువాదం కాకుంటే ఇంగ్లిష్ వర్షన్ కాపీని పరిగణనలోకి తీసుకుంటారు.
– సమాధానాలు గుర్తించేందకు, పొరపాట్లు జరుగకుండా ప్రక్టీస్ చేసేందుకు నమూనా ఓఎంఆర్ పత్రాన్ని కమిషన్ వెబ్సైట్లో ఉంచింది. ఓఎంఆర్లో వివరాలు సరిగా బబుల్ చేయకుంటే దానిని తిరస్కరిస్తారు.
– హాల్టికెట్తోపాటు ఏదైనా గుర్తింపు కార్డుతో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు రావాలి. పాస్పోర్టు, పాన్కార్డు, ఓటర్కార్డు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉండాలి.
– పరీక్ష కేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలి. తర్వాత గేట్లు మూసివేస్తారు. కేంద్రంలోకి ఎవరినీ అనుమతించరు. 9:30 గంటలకు బయోమెట్రిక్ ప్రక్రియ ప్రారంభిస్తారు.
– బయోమెట్రిక్లో పింగర్ప్రింట్ తీసుకునేందుకు వీలు కాకుంటే అభ్యర్థి ఫొటో తీసుకుని ఇంక్ప్యాడ్ ద్వారా వేలిముద్రను బయోమెట్రిక్ తీసుకుంటారు.
– అభ్యర్థులు చేతులపై గోరింటాకు, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దు.