Agneepath Incident: శిక్షణ సంస్థలో.. రాజకీయ పార్టీలో లేక మరెవరో.. ఉడుకు నెత్తురు ఉప్పెన లాంటి యువతను అగ్నిపథ్ పై ఎగదోశారు. వారు తమకు ఉద్యోగాలు రావేమోనన్న ఆందోళన ఒత్తిడితో రైల్వేస్టేషన్లపై పడిపోయారు. ఇప్పుడు ఆ తప్పే వారి జీవితాన్ని అంధకారం చేయనుంది. తెలిసి తెలియని తప్పుకు వారిప్పుడు జీవితాన్నే ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి చేసిన నిరుద్యోగ యువత జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితులు తలెత్తనున్నాయి.
మామూలు కేసులకు.. రైల్వే కేసులకు చాలా తేడా ఉంది. జాతీయ సంపద అయిన రైల్వేపై దాడిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దీంతో ఇప్పుడు అగ్నిపథ్ పథకంపై నిరసనలో భాగంగా రైల్వే స్టేషన్లలో జరిగిన దాడికి బాధ్యులైన నిరుద్యోగ యువత జీవితమే అంధకారంగా మారనుంది. ఈ ఆందోళనలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు దగ్ధమయ్యాయి. సికింద్రాబాద్ లో అయితే విధ్వంసకాండ చోటుచేసుకుంది. ఈ విధ్వంసానికి కారణమైన 46 మందిని అన్ని ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. అంతేకాదు.. రైల్వేస్టేషన్లలో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్సీ బాంబు పేల్చారు. రైల్వే కేసులలో శిక్ష పడ్డ వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావని.. వారి జీవితం నాశనమైనట్టేనని స్పష్టం చేశారు.
-రెచ్చగొడితే రెచ్చిపోయిన నిరుద్యోగులు..
శిక్షణా సంస్థలు.. పలు రాజకీయ పార్టీల ప్రోద్బలంతో దాదాపు 2000 మంది నిరుద్యోగులు ఈ విధ్వంసకాండను సృష్టించారు. ఈ విధ్వంసకాండ కోసం పలువురిని రెచ్చగొట్టారని విచారణలో తేలింది. జూన్ 17వ తేదీన జరిగిన ఈ హింసలో తొలుత 300 మంది వచ్చారు. కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాంబులతో ఎంట్రీ అయ్యారని సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. ఉదయం 9.30 కల్లా 2వేల మంది రైల్వే స్టేషన్ చేసుకొని మొత్తం విధ్వంసం సృష్టించారు.
-దాడికి పాల్పడిన వారంతా తెలంగాణ నిరుద్యోగులే
రైల్వేస్టేషన్ పై దాడికి పాల్పడిన వారంతా తెలంగాణకు చెందిన నిరుద్యోగులేనని విచారణలో తేలింది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించారు. ఈ్టస్ట్ కోస్ట్, దానాపూర్, అజంతా ఎక్స్ ప్రెస్ రైళ్లకు నిప్పు పెట్టారు. మొత్తం నాలుగు బోగీలను దగ్ధం చేశారు. 58 అద్దాలు పగులకొట్టారు.
-రైల్వే పోలీసులు కాల్పులు జరిపింది అందుకే..
ఆందోళనకారుల ఎంట్రీతో ప్రయాణికులు అంతా భయంతో పరుగులు తీశారు. రైల్వే పోలీసులు ఎంతగా ఆందోళనకారులను అడ్డుకున్నప్పటికీ వారు రాళ్లతో దాడి చేశారు. ఇక డీజిల్ ట్యాంకుకు నిప్పు పెట్టడానికి ప్రయత్నించిన ఆందోళనకారులపై రైల్వే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. లేకుంటా ఆ ట్యాంకు అంటుకుంటే రైల్వే స్టేషన్ చుట్టుపక్కల అంతా తుడుచుకుపెట్టుకొని పోయేది. అందరూ చనిపోయేవారు. అందుకే రైల్వే పోలీసులు కాల్పులు జరిపి డీజిల్ ట్యాంకును కాపాడారని తెలిపారు.
-నిరుద్యోగులు 46 మంది అరెస్ట్.. చంచల్ గూడ జైలుకు తరలింపు
సికింద్రాబాద్ విధ్వంసం కేసులో 46 మందిని పక్కా ఆధారాలతో గుర్తించి అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వీరిని కోర్టులో హాజరు పరచగా చంచల్ గూడ జైలుకు తరలించారు. విధ్వంసకాండ వెనుక కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని.. వారిని కూడా అరెస్ట్ చేస్తామని రైల్వే ఎస్పీ తెలిపారు.
Also Read: Allu Arjun Pushpa 2: సుకుమార్ కూడా అదే చేస్తే… కెజిఎఫ్ కి పుష్పకి తేడా ఏముంది?
-వాట్సాప్ గ్రూపులతో కుట్ర.. నిరుద్యోగులు బలి
ఆందోళనాకారులు పలు వాట్సాప్ గ్రూపులతో ఈ కుట్ర పన్నారు. అందులోని ఉద్యోగం రాకుండా కష్టపడుతున్న నిరుద్యోగులను టార్గెట్ చేశారు. ఆర్మీ ర్యాలీకి వచ్చిన అభ్యర్థులను టార్గెట్ చేసి ఈ కుట్రలో భాగస్వాములు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా ఇప్పుడు అందరినీ పరిశీలించి అరెస్ట్ చేశారు. మొత్తం 2వేల మంది ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారు.
-బీహార్ ఫార్ములా తెలంగాణలో అమలు
బీహార్ లో ఎలాగైతే రైళ్లను తగులబెట్టారో అదే విధంగా ఇక్కడ కూడా విధ్వంసం సృష్టించాలని వాట్సాప్ గ్రూపుల్లో కుట్రలు పన్నారు. ఆ కుట్రలో నిరుద్యోగ యువత బలయ్యారు. రైల్వే ఆస్తులపై కుట్రలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలియక నిరుద్యోగులు ఉద్రేకంతో దాడులు చేసి ఇప్పుడు నిండా మునిగారు.
-ఒక్క ఘటన.. 15 కేసులు.. నిరూపితమైతే నిరుద్యోగుల జీవితం ఖతం
సికింద్రాబాద్ విధ్వంసం కేసులో కొందరిపై 15 కేసుల వరకూ పెట్టారు. దాదాపు అందరి విధ్వంసకారులపై ఈ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ కేసులు నిరూపితమైతే నిరుద్యోగులకు జీవితఖైదు పడడం ఖాయం. అంతేకాదు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కాదు. జీవితాంతం జైల్లో మగ్గాల్సి వస్తుంది. యావజ్జీవ శిక్ష పడే అవకాశాలున్నాయి. దీంతో ఉద్రేకంతో జాతీయ ఆస్తులను తెలియక దగ్ధం చేసిన నిరుద్యోగ నిరసనకారులు ఇప్పుడు జీవితాలనే ఫణంగా పెట్టాల్సి వచ్చింది. తెలియక చేసిన ఈ ఆందోళనకు మూల్యం చెల్లించుకోవాల్సిను దుస్థితి ఏర్పడింది.
Also Read: Pawan Kalyan : దసరా తర్వాత మీ సంగతి చూస్తా.. హెచ్చరికలు పంపిన పవన్ కళ్యాణ్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More