Tuni Gnaneswari missing case update: తునిలో మిస్సింగ్ అయిన జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించలేదు. కాకినాడ జిల్లాలోని తుని మండలం చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి 9 రోజుల క్రితం నుంచి కనిపించడం లేదు. ఆమె ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలే విధంగా రోదిస్తున్నారు.
మీడియా ద్వారా ఈ వ్యవహారం సంచలనం కావడంతో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అత్యంత ఆధునికమైన థర్మల్ డ్రోన్ ల సహాయంతో పరిశీలిస్తున్నారు. ఆ పాప మీద అడవి జంతువులు ఏమైనా దాడి చేశాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అలాంటి అవకాశాలు లేవని అధికారుల పరిశీలనలో తేలింది. పైగా అక్కడ అటవీ ప్రాంతాలు లేవు. జంతువుల జాడ కూడా కనిపించడం లేదు. ఒకవేళ ప్రమాదకరమైన పాములు.. కొండచిలువలు సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అవి ఏమైనా దాడులు చేశాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు..
ఇంతవరకు ఈ ప్రాంతంలో అడవి జంతువులు సంచరించినట్టుగాని.. పిల్లల మీద దాడులు చేసిన ఆన వాళ్లు గాని లేవు. అధికారుల బృందాలు పలు కోణాలలో దర్యాప్తు చేపడుతున్నాయి. మరోవైపు జ్ఞానేశ్వరుని చూసిన ఒక వ్యక్తి.. నేరుగా ఆమె తల్లికి చెప్పకుండా గ్రామంలో ఉన్న వ్యక్తులకు చెప్పాడు. దీంతో జ్ఞానేశ్వరి తల్లి అతడి మీద అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆ పాప ఎక్కడ ఉన్నా సరే తమ వద్దకు చేరుకుంటుందని తల్లిదండ్రులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరో అపహరించి ఉంటారని.. వారు భావిస్తున్నారు.
పాపతోపాటు అదేరోజు అదృశ్యమైన కుక్క మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. ఆ కుక్క గత శనివారం మధ్యాహ్నం కన్నుమూసింది. ఆ కుక్క కళేబరాన్ని ఎస్ సురవరం వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. అనేక నమూనాల సేకరించి విశాఖపట్నంలో ఉన్న ప్రయోగశాలకు పంపించారు. అయితే ఆ కుక్క ఎండవేడికి తిరగడం వల్ల చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. కుక్కపై విష ప్రయోగం జరిగిందనే కోణంలో కూడా పరిశీలన జరిపారని.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ కుక్క మీద విష ప్రయోగం జరిగి ఉంటే అప్పుడు.. వేరే కోణాలలో జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
