LPG cylinder theft case police suspended: ఒక అవసరం మనిషితో ఏ పనైనా చేయిస్తుంది. దానికి హోదాతో పనిలేదు. ఇతర విషయాలతో సంబంధం లేదు.. ఆ సమయానికి మనిషికి ఏది అనిపిస్తే అదే చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగినా సరే పట్టించుకోడు. మానసిక వైద్యుల పరిభాషలో.. ఇటువంటి సంఘటనలను కార్యకారక సంబంధాలు అని పిలుస్తుంటారు.
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాలలో పరిస్థితి దారుణంగా మారింది. ఆ దేశాల నుంచి మనకు చమురు, గ్యాస్ సరఫరా అవుతుంది. అక్కడ పరిస్థితులు అంతకంతకు క్లిష్టంగా మారిన నేపథ్యంలో.. చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారులు ఉన్న దేశం మనది. ఇక్కడ ప్రజల అవసరాలు తీరాలంటే కచ్చితంగా సరిపడా గ్యాస్, చమురు అవసరం. గల్ఫ్ దేశాలలో యుద్ధం వల్ల అక్కడ పరిస్థితి దారుణంగా మారింది. అందువల్లే అక్కడ నుంచి గ్యాస్, చమురు సరఫరా అరకొరగా సాగుతోంది. దీంతో మనదేశంలో గ్యాస్ కు డిమాండ్ పెరిగింది. ఫలితంగా రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం హోటళ్ళకు సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ లో ఆంక్షలు విధించింది. దీంతో చాలావరకు హోటళ్లు మూతపడ్డాయి.. హాస్టల్లు కూడా షట్ డౌన్ అయ్యాయి. కొన్ని హోటళ్లు కట్టెల పోయిలను వాడటం మొదలుపెట్టాయి.
గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో దొంగతనాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతంలో ఆ మధ్య గ్యాస్ సిలిండర్ల లారీని దొంగలు అపహరించారు. సిలిండర్లను అమ్ముకున్నారు. పోలీసులు ఎంక్వయిరీ చేస్తుండగా దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఆత్మ రక్షణ కోసం పోలీసులు తిరిగి కాల్పులు చేపట్టారు. చివరికి గ్యాస్ లారీ ని కనుకున్నప్పటికీ.. సిలిండర్లను అక్రమార్కులు అమ్ముకోవడంతో.. పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు.
ఝాన్సీ ప్రాంతంలో జరిగిన ఘటన మర్చిపోకముందే.. ఝార్ఖండ్ ప్రాంతంలో మరో దారుణం చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలో ఓ భవనంలో పేలుడు చోటుచేసుకుంది. భారీగా నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో పోలీసులు సహాయక చర్యల కోసం వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడ 43 ఎల్పిజి సిలిండర్లను గుర్తించారు. మరో మాటకు తావు లేకుండా ఆ ఎల్పిజి సిలిండర్ లను అపహరించారు. ఈ చోరీ వ్యవహారంలో 9 మంది పోలీసులు పాల్గొన్నట్టు అధికారుల విచారణలో తేలింది. 43 సిలిండర్లను స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు.. 9 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..
సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి పాటు పడాల్సిన పోలీసులు.. ఎల్పిజి సిలిండర్లను దొంగతనం చేయడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న అత్యయిక పరిస్థితిలో.. పోలీసులు ఇలాంటి దారుణానికి పాల్పడటం సరికాదని ప్రజలు పేర్కొంటున్నారు.