Ghaziabad Jewellery Shop Theft: అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. ఘజియాబాద్ నగరం. ఇక్కడ ఒక ప్రముఖ సంస్థ నగల దుకాణాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ఇక్కడ భారీగా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఈ నగల దుకాణంలో ఇటీవల చోరీ జరిగింది. ఆ చోరి కూడా భారీ స్థాయిలో జరిగింది. సుమారు నాలుగు కోట్ల విలువైన నగలు మాయమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగారు. అనేక ఆధారాలను పరిశీలించారు.. ఆ తర్వాత వారి విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. ఆ నిజాన్ని తట్టుకోలేక ఆ నగల యజమాని ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ప్లాన్ ప్రకారం
నగల దుకాణంలో నితిన్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం ఉద్యోగంలో చేరాడు. అయితే అతడు ఉద్యోగం కోసం అందులో చేరలేదు. పక్క ప్రణాళిక ప్రకారమే అందులో చేరాడు. విధులను పక్కనపెట్టి బంగారు నగలు ఎక్కడ దాస్తున్నారు.. వాటి తాళాలు ఎక్కడ ఉంటున్నాయి.. సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి.. అనే విషయాలను పరిశీలించాడు. సరిగా ఈనెల 12న షోరూమ్ లో పనిచేసే సిబ్బందికి అతడు దావత్ ఇచ్చాడు. తనకు పెళ్లి కుదిరిందని.. అందువల్లే ఈ విందు ఇస్తున్నానని చెప్పాడు. ఆ పార్టీకి తనకు కాబోయే భార్య కాజల్.. అతడి తండ్రి హాజరయ్యారు. ఈ క్రమంలో షోరూం తాళాలను పర్యవేక్షించే క్యాషియర్ గౌతమ్ కు ఎక్కువ మోతాదులో మద్యం తాగించాడు.. అతడిని ఇంటి వద్ద దింపి.. తాళం చేతులు తీసుకున్నాడు.
వెంటనే మరుసటి రోజు తన స్నేహితులతో కలిసి నితిన్ నగల దుకాణానికి వచ్చాడు. ఆ తాళం చెవిలతో షట్టర్ ఓపెన్ చేశాడు. పావుగంట సమయంలోనే దాదాపు నాలుగు కోట్ల విలువైన ఆభరణాలు మొత్తం దోచుకున్నాడు. అయితే షో రూమ్ వద్ద ఎటువంటి అలారం వ్యవస్థ లేదు. దీంతో నితిన్ పని ఈజీ అయిపోయింది. అయితే సెక్యూరిటీ గార్డ్ ఉదయం ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ఈ ఘటన జరిగింది. పోలీసులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత నితిన్ ను అదుపులోకి తీసుకున్నారు. తన స్నేహితురాలితో పెళ్లి కోసమే తాను నగలు చోరీ చేసినట్టు అతడు ఒప్పుకున్నాడు. నితిన్, అతడి ప్రేయసి, ఆమె తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
స్నేహితురాలితో పెళ్లి కోసం ఈ స్థాయిలో బంగారాన్ని చోరీ చేసిన నితిన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకోవాలంటే బంగారం ఎందుకు.. కష్టపడి పని చేసుకుని భార్యను సాక వచ్చు కదా.. ఇప్పుడు దొంగతనాలకు అలవాటు పడ్డావు.. రేపటి నాడు ఏదైనా చేస్తావని చాలామంది అతడిని విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి ప్రేమించే అర్హత లేదని.. కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.
