Black Money Scam: శివాజీ సినిమా చూశారా.. లేదా మల్లన్న సినిమా చూశారా.. పోనీ ఏవైనా హిందీ వెబ్ సిరీస్ లు చూశారా.. అందులో కొంతమంది వ్యక్తులు ఒక చిరిగిన 10 రూపాయల నోటు తీసుకొస్తారు. ఆ నోటును వేరే వ్యక్తులకు ఇస్తారు. ఆ రెండు నోట్లు సరిపోలుతాయి. అప్పుడు కట్టలకు కట్టలు నోట్ల బ్యాగులు బయటికి వస్తాయి. ఒకటి కాదు రెండు కాదు.. వందల కోట్లు చేతులు మారుతాయి. ఇదంతా బ్లాక్ మనీ.. మొత్తం తెల్లగా మారే ప్రయత్నం. దీని వెనక ఏం జరుగుతుంది.. ఎలా జరుగుతుంది.. ఎవరు ఉన్నారు అనే విషయాలను దర్శకులు మనకు అర్థమయ్యేలాగా చెబుతారు.
వాస్తవానికి నల్ల డబ్బును తెల్లగా మార్చడం కష్టమైన పని. దీనికోసం అనేక రకాల అడ్డంకులను దాటుకోవాలి. అత్యంత పలుకుబడి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. కానీ దీనిని సాధ్యమను నిరూపించారు కొంతమంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే పోలీసులకు దొరికిపోయారు. చివరికి అన్ని మూసుకొని జైలు గోడల మధ్య బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు 12 మందిని పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు పరారీలో ఉన్నారు. కల్లూరు ఏసీపీ వసుంధర చెప్పిన వివరాల ప్రకారం.. జూన్ నెల 25న కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన కుర్ర గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును సత్తుపల్లి సిఐ శ్రీహరి స్వీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రత్యేకమైన బృందాలతో గాలింపు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గంగారం శివారు ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే అసలు నలుపు వ్యవహారం బయటపడింది.
ఏలూరు జిల్లాలోని వెంకటాపురం ప్రాంతానికి చెందిన చంటిబాబు అనే వ్యక్తి ఒక ముఠా ను నిర్వహిస్తున్నాడు. ఇతడు మరో 13 మందితో కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. వీరంతా కూడా రకరకాల సిమ్ కార్డులు ఉపయోగించి అమాయకులకు ఫోన్ చేసేవారు. తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులమని.. తమబద్ధ బ్లాక్ మనీ భారీగా ఉందని.. అదంతా వైట్ గా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేవారు. ముందుగా 10 లక్షలు గనుక ఇస్తే 40 లక్షలు బ్యాంకు అకౌంట్లో వేస్తామని ఆశ చూపించేవారు. అలా ముందుగా ఒక ప్రాంతానికి బాధితులను పిలిపించేవారు. ఆ తర్వాత వారు నగదు తీసుకొస్తే.. ఫేక్ కరెన్సీ నింపిన బ్యాగు ఇచ్చేవారు.. అయితే ఈ ముఠాలో కొంతమంది నిజమైన పోలీసులు.. కొంతమంది నకిలీ పోలీసులు ఉండేవారు. వారంతా కూడా అక్కడికి చేరుకొని దాడులు మొదలుపెట్టేవారు. డబ్బు మొత్తం తీసుకొని పారిపోయేవారు. ఇలా అనేక ప్రాంతాల్లో మోసం చేశారు.
ఈ వ్యవహారంలో పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు ముల్లగిరి వర్ధన్.. ఆర్ఎస్ఐ కేశవరావు ఉన్నారు. పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేసి దాదాపు 17.6 లక్షల నగదు.. మూడు కార్లు.. ఒక స్కూటీ.. కొన్ని సెల్ ఫోన్లు.. పోలీసులు వాడే దుస్తులు.. హ్యాండ్ క్యాప్స్.. నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఇద్దరు ఉన్నారు. వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

