Bheem Reddy: ఆయన పేరు భీమిరెడ్డి.. తెలంగాణ పోలీస్ శాఖలో డిఎస్పి. డిజిపి ఆఫీసులో స్టేషనరీ వింగ్లో పనిచేస్తూ ఉంటారు. ఈయన ఇంట్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. భారీగా సోదాలు చేశారు. ఈ సోదాలలో ఏకంగా వందల కోట్ల ఆస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.
పోలీస్ శాఖలో ఈ స్థాయిలో అక్రమ సంపాదన ఉంటుందా అని ఏసీబీ అధికారులు నోటి మీద వేలుసుకుంటున్నారు. అసలు ఇంతటి సంపాదన ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యపోతున్నారు. భీమ్ రెడ్డికి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్.. వికారాబాద్.. జహీరాబాద్.. గచ్చిబౌలి.. రంగారెడ్డి.. శంషాబాద్ ప్రాంతాలలో భారీగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాలలో పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల సమయంలో పోలీసులకు ఒక డైరీ లభించింది. ఆ డైరీలో భీమిరెడ్డికి సంబంధించిన బినామీల చిట్టా ఉన్నట్టు సమాచారం. ఆ బినామీలలో దాదాపు 15 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది.
భీమ్ రెడ్డికి సంబంధించిన ఒక బినామీ ఇంట్లో నుంచి ఏసీబీ అధికారులు వేగంగా 40 లక్షల వరకు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో కూడా భీమిరెడ్డి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన బహుళ అంతస్తుల భవనాన్ని తన కూతురి పేరు మీద భీమిరెడ్డి కొనుగోలు చేశారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ఓ ప్రాంతంలో ఏకంగా ఎకరం భూమి ఉన్నట్టు తెలుస్తోంది. దీని విలువ కూడా భారీగా ఉన్నట్టు సమాచారం. ఓపెన్ ప్లాట్లు.. సాగు భూములు కూడా భీమిరెడ్డి పేరు మీద ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అనేక రకాల ల్యాండ్ డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని కూడా భారీగా కూడబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
భీమిరెడ్డి అక్రమ సామ్రాజ్యం అత్యంత పెద్దదిగా ఉంది. బ్యాంకు లాకర్లు మాత్రమే కాకుండా.. బినామీ ఖాతాలు కూడా ఉన్నాయి. ఈ ఆస్తులను మొత్తం లెక్కించడానికి ఇంకా రెండు నుంచి మూడు రోజుల వరకు పట్టే అవకాశం ఉంది. భీమిరెడ్డి.. పోలీస్ శాఖలో అవినీతి అనకొండ అని.. అక్రమ ఆస్తులను సంపాదించడంలో బాహుబలి అని.. ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అతడిని త్వరలోనే అధికారికంగా అరెస్ట్ చేస్తామని.. రిమాండ్ కు తరలిస్తామని పేర్కొన్నారు.

