Tirupati: నేటి కాలంలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొంతకాలానికే విడి పోతున్నారు. ఆ తర్వాత కోర్టుల దాకా వెళ్లి విడాకులు తీసుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇటీవల కాలంలో ఈ తరహా ఉదంతాలు పెరిగిపోతున్నాయి. ప్రేమించడం.. అదే మైకంలో పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత చిన్నచిన్న వాటికే గొడవ పడుతున్నారు. ఆవేశం తట్టుకోలేక విడిపోతున్నారు.
సెలబ్రిటీలు అంటే డబ్బున్న వాళ్ళు కాబట్టి.. విడాకులు త్వరగానే తీసుకుంటారు. ఆ తర్వాత రొటీన్ లైఫ్ లో మునిగిపోతుంటారు. కానీ సామాన్యుల పరిస్థితి అలా ఉండదు. విడాకులు.. ఇతర వ్యవహారాలు.. కోర్టు ఖర్చులు భరించలేరు. ఇందులో కొంతమంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఆ మధ్య బెంగుళూరులో ఓఐటి ఉద్యోగి భార్య పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన బాధను మొత్తం సోషల్ మీడియాలో వ్యక్తం చేశాడు. తద్వారా అతని వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అనంతరం ఆతరహా సంఘటనలు దేశంలో పెరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా పుత్తూరులో ఓ దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న పద్మ అనే వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. భర్తకు ఉద్యోగం లేకపోవడం.. అప్పుల బాధ పెరిగిపోవడం వల్ల ఆమె ఈ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్యకు ముందు ఒక లేఖ కూడా రాసింది. “తల్లిదండ్రులను ఎదిరించాను. పెళ్లి చేసుకున్నాను. ఇద్దరు పిల్లలను కన్నాను. భర్తకు ఉద్యోగం లేదు. పోషించే సామర్థ్యం లేదు. అప్పులు పెరిగిపోయాయి.ఏం చేయాలో తెలియడం లేదు. రోజురోజుకు ఒత్తిడి పెరిగిపోతోంది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారందరికీ నా జీవితం ఒక గుణపాఠమని” పద్మ తను రాసిన ఆత్మహత్య లేఖలో పేర్కొంది.
పద్మ భర్త మొదట్లో బాగానే ఉండేవాడు. ఆ తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది. అంతేకాదు పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యత లేకుండా తిరగడం మొదలుపెట్టాడు. ఉద్యోగం లేకపోవడం.. భార్య పిల్లలను సాకే సామర్థ్యం లేకపోవడం.. అన్నిటికీ మించి అప్పులు పెరిగిపోవడంతో పద్మ కీలకమైన నిర్ణయం తీసుకుంది. చివరికి తన పిల్లలతో కలిసి బలవంతంగా తనువు చాలించింది. పద్మ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆమె తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తన కూతురు ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదని వాపోయారు. గుండెలు బాదుకుంటూ విలపించారు.
