Khammam: పెళ్లైనా, మరో మహిళతో వివాహేతర సంబంధం.. ఆస్తికోసం ఎంతటి దారుణానికి ఒడిగట్టాడంటే..

ఉమ్మడి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు, స్వరూప (పేరు మార్చాం) అనే దంపతులు ఉండేవారు. వీరికి నీరజ (10), ఝాన్సీ (6) అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 18, 2024 5:17 pm

Khammam

Follow us on

Khammam: రాక్షసులకు కూడా కొద్దో గొప్పో జాలి, దయ, కరుణ, ప్రేమ అనేవి ఉంటాయి. చివరికి జంతువులు కూడా తమ తోటి జంతువుల మీద ఎంతో కొంత వాత్సల్యాన్ని చూపిస్తుంటాయి. కానీ, మనిషి రూపంలో పుట్టిన ఇతడు ఒక నరరూప రాక్షసుడిగా మారిపోయాడు. ఏమాత్రం జాలి, దయ, కరుణ అనేవి లేకుండా సైతాన్ లాగా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యను చంపేసి.. మరో మహిళకు దగ్గరయ్యాడు. చివరికి ఆస్తికోసం మరింత దారుణానికి ఒడిగట్టాడు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు, స్వరూప (పేరు మార్చాం) అనే దంపతులు ఉండేవారు. వీరికి నీరజ (10), ఝాన్సీ (6) అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. వెంకటేశ్వర్లు మొదట్లో తన భార్యతో బాగానే ఉండేవాడు. మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధం ప్రారంభించాడు. వెంకటేశ్వర్లు సాగిస్తున్న వివాహేతర సంబంధం తెలియడంతో స్వరూప నిలదీసింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. పంచాయితీ లు పెద్దమనుషుల దాకా వెళ్లాయి. ఇంకోసారి ఆ మహిళ దగ్గరికి తాను వెళ్ళనని వెంకటేశ్వర్లు పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకున్నాడు. కానీ, తర్వాత ఆ మాటను పక్కనపెట్టి.. మళ్లీ ఆమె దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టాడు. ఫలితంగా స్వరూప, వెంకటేశ్వర్ల మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు గొడవలు తారాస్థాయికి చేరడంతో.. కోపం పట్టలేక వెంకటేశ్వర్లు స్వరూపను చంపేశాడు. కొద్దిరోజులపాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. ఇటీవల బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆ మహిళ తన పేరు మీద ఆస్తి కావాలని వెంకటేశ్వర్లను డిమాండ్ చేసింది. దీంతో తన తల్లి పిచ్చమ్మ (60) పేరు మీద ఉన్న పొలం తన పేరిట చేయాలని ఆమెను వేధిస్తూ వస్తున్నాడు. అయితే ఆమె దీనికి నిరాకరించింది.

వెంకటేశ్వర్లు వాలకం తెలుసు కాబట్టి.. పైగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. వారి పెళ్లిళ్ల కోసం ఆ పొలం తన పేరు మీదే ఉంచుకుంటానని పిచ్చమ్మ వాదించింది. దీంతో వెంకటేశ్వర్లు ఆమెతో పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. శుక్రవారం రాత్రి తల్లి పిచ్చమ్మ, కొడుకు వెంకటేశ్వర్ల మధ్య పొలానికి సంబంధించి గొడవ జరిగింది. దీంతో వెంకటేశ్వర్లు కోపాన్ని అణుచుకోలేక తల్లి పిచ్చమ్మను గొంతు నులిమి చంపేశాడు. ఇద్దరు కుమార్తెలు నీరజ, ఝాన్సీ ని కూడా హతమార్చాడు. ఆ తర్వాత అతడు పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. అటు తల్లిని, ఇటు ఇద్దరు కుమార్తెలను చంపడంతో గోపాలపేట విషాదంలో మునిగిపోయింది.