దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా చికిత్స కోసం కొత్త ఔషధాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా వైద్య నిపుణులు కరోనా చికిత్సలో భాగంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్ డ్రగ్ ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతుండటం గమనార్హం. తెలంగాణలోని యశోద, ఏఐజీ ఆస్పత్రులలో ప్రయోగాత్మకంగా ఈ మందును వినియోగిస్తున్నారు.
ఈ ఔషధాన్ని వినియోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటున్నాయని ఈ ఔషధాన్ని వాడిన వాళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. కసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ ఔషధాలను కలిపి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్గా తయారు చేశారు. ఈ ఔషధం కరోనా స్పైక్ ప్రొటీన్, దాని అటాచ్మెంట్ మన శరీరంలోని కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.
కరోనా నిర్ధారణ కాగానే ఈ ఔషధం తీసుకుంటే రోగి ఆస్పత్రిలో చేరే అవకాశాలు 70 శాతం వరకు తగ్గుతాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇంజెక్షన్ తీసుకుని కోలుకున్నారు. ఆ తర్వాత అమెరికా, బ్రిటన్ లలో ఈ మందు అందుబాటులోకి రాగా మన దేశంలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఈ మందుకు అనుమతులను ఇచ్చింది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు ఈ ఔషధం తీసుకుంటే కరోనా నుంచి కోలుకోవచ్చు.
మన దేశంలో ఈ ఇంజక్షన్ కేవలం 60వేల రూపాయలకే అందుబాటులో ఉంది. బ్రిటన్ , దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లపై ఈ ఔషధం సమర్థవంతంగా పని చేస్తోంది. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఈ ఔషధంతో ప్రయోజనం చేకూరుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.