Quick commerce sites impact: రిలయన్స్ నుంచి టాటా వరకు అన్ని కంపెనీలు ఈ రంగంలోకి వచ్చేసాయి. వేలకోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. వేలాది మందిని రిక్రూట్ చేసుకొని.. ఈ వ్యాపారాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ప్రతి కస్టమర్ తమకు విలువైన వాడని.. అతడి సమయాన్ని వృధా చేయకూడదని.. చెబుతూ అతడు కాలు కదపకుండానే.. ప్రతిదీ చేరవేరుస్తున్నాయి. ఫలితంగా ఆ కంపెనీలు అంతకుమించి అనే స్థాయిలో ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. చూస్తుండగానే పదులు, వందలు దాటి వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నాయి.
మంచి వెనక చెడు ఉన్నట్టు.. బొమ్మ వెనక బొరుసు కూడా ఉన్నట్టు.. క్విక్ కామర్స్ సైట్ల వల్ల జేబులు గుల్ల అవుతున్నాయి. భారతీయుల ఆర్థిక స్థిరత్వం మీద ప్రభావం చూపిస్తున్నాయి. క్విక్ కామర్స్ సైట్ల వల్ల ఆన్ డిమాండ్ లివింగ్ పెరిగిపోయింది. వస్తువులు నిమిషాల్లోనే ఇంటికి వస్తున్నాయి. దీనివల్ల ప్రజలు ఖర్చు చేసే విధానం పూర్తిగా మారిపోతుంది. అప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల.. పొదుపు క్రమశిక్షణ లోపిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
క్విక్ కామర్స్ సైట్లు విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీనివల్ల ఆయా సంస్థల ఆదాయం పెరుగుతోంది. అర్బన్ లైఫ్ స్టైల్ వల్ల చాలామంది లగ్జరీ లైవ్ కోరుకుంటున్నారు. ఇదే క్రమంలో క్విక్ కామర్స్ సైట్లు ప్రజల సేవింగ్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయి.
ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం
.. 2020లో ఆన్లైన్లో గ్రాసరి కొనుగోలు 23,951 కోట్లుగా నమోదయింది. 2025 సంవత్సరం నాటికి అది 65,645 కోట్లుగా నమోదయింది. గతంలో కొనే వారి శాతం 33 ఉండగా.. ఇప్పుడు అది ఏకంగా 87 శాతానికి చేరుకుంది.
క్విక్ కామర్స్ సైట్ల వల్ల ఉన్న చోటు నుంచి షాపింగ్ చేసే అవకాశం లభిస్తోంది. అది తెలియకుండానే మన జేబులకు చిల్లు పెడుతోంది. ఇదే క్రమంలో మోసపూరిత అమ్మకాలు.. అనవసరమైన కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజల ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా దారి తప్పుతోంది. అందువల్ల ప్రజలు తమ పొదుపును తగ్గించుకోవాల్సి వస్తోంది. దీర్ఘకాలం ఇదే విధానం కొనసాగితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని.. సంస్థలు ఆర్థికంగా లాభపడినప్పటికీ.. అంతిమంగా ప్రజల పొదుపు ప్రభావితమైతే.. ఆ సంస్థల మనుగడ కూడా కష్టమవుతుందని తెలుస్తోంది.