MG Windsor EV: ఏడు నెలల క్రితం ఇండియాలో లాంచ్ అయిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఇండో-బ్రిటిష్ బ్రాండ్ అయిన ఎంజీ మోటార్స్ కు నిజంగా గేమ్ ఛేంజర్ అనే చెప్పుకోవాలి. లాంచ్ అయిన ఆరు నెలల్లోనే ఎంజీ దేశవ్యాప్తంగా ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ను 20,000 యూనిట్లకు పైగా విక్రయించింది. దీంతో ఇది అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించింది. గత నెలలో ఈ కారు కేవలం కంపెనీకే కాదు.. మొత్తం సెగ్మెంట్లోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఇప్పుడు కంపెనీ ఈ కారు లాంగ్ రేంజ్ వెర్షన్ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది.
Also Read: యాపిల్పై సుంకాల భారం.. భారత్లో ఉత్పత్తి విస్తరణకు సన్నాహం!
ఇటీవల ఎంజీ మోటార్ విండ్సర్ ఈవీ మొదటి అప్డేట్ను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ అప్డేటెడ్ వెర్షన్లో కొన్ని కొత్త ఫీచర్లు ఉండవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో పెద్ద బ్యాటరీ ప్యాక్ను అందించనున్నారు. ఇప్పుడు అప్డేటెడ్ విండ్సర్ ఈవీ టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ కారు హర్యానాలోని గురుగ్రామ్ పరిసరాల్లో టెస్టింగ్ సమయంలో కనిపించింది. టెస్టింగ్ మోడల్ పూర్తిగా కప్పివేయబడి ఉంది. స్టైలింగ్ పరంగా ఎటువంటి కాస్మెటిక్ మార్పులు ఉండవని స్పష్టంగా తెలుస్తోంది.
ఇంతకుముందు చెప్పినట్లుగా ఎంజీ విండ్సర్ ఈవీ అప్గ్రేడెడ్ 50.6 kWh బ్యాటరీ ప్యాక్తో రానుంది. ఇదే బ్యాటరీ ప్రస్తుతం ఇండోనేషియాలో అమ్ముడవుతున్న వూలింగ్ క్లౌడ్ ఈవీలో కూడా అందుబాటులో ఉంది. ఈ పెద్ద బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 460 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. ప్రస్తుతం విండ్సర్ ఈవీలో 38 కిలో వాట్స్ బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్ను ఇస్తుంది. కొత్త వేరియంట్ వచ్చే నెల ప్రారంభంలో భారతదేశంలోని ఎంజీ డీలర్షిప్లలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. మే 6, 2025న ఈ కారు లాంచ్ కానుందని తెలుస్తోంది. దీనికి ‘విండ్సర్ ప్రో’ అని పేరు పెట్టనున్నట్లు సమాచారం.
ఎంజీ ప్రస్తుత ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటర్ను కొనసాగించవచ్చు, ఇది 134 bhp పవర్, 200 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు గంటకు 170 కిలోమీటర్ల టాప్ స్పీడ్ను చేరుకోగలదు. విండ్సర్ కేవలం 8.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ స్పీడ్ అందుకుంటుంది. విండ్సర్ ఈవీ కొత్త మోడల్లో టెర్రైన్ మోడ్ను కూడా అందించే అవకాశం ఉంది.