Country Delight Milk: మార్కెట్లో అన్నిరకాల రెడీమేడ్ ఫుడ్ దొరుకుతోంది. ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న వ్యాపారాల్లో మెడికల్, ఎడ్యుకేషన్, ఫుడ్, లిక్కర్. వీటిలో ఫుడ్ బిజినెస్కు చాలా డిమాండ్ ఉంది. ఎన్నిరకాల వెరైటీలు ఉంటే.. ఫుడ్ లవర్స్ అంతగా ఇష్టపడుతున్నారు. దీంతో మార్కెట్లో డిఫరెంట్ ఐటంలు వస్తున్నాయి. ప్రస్తుత బిజీ షెడ్యూల్ నేపథ్యంలో చాలా మంది రెడీమేడ్ ఫుడ్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆన్లైన్ వ్యాపారం కూడా పుంజుకుంది. అయితే కోవిడ్తో ఒక్కసారిగా ఈ వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. కోవిడ్ తర్వాత చాలా మంది పాతకాలం నాటి నేచురల్ ఫుడ్ తీసుకోవడం ప్రారంభించారు. దీనిని గుర్తించిన ఇద్దరు మిత్రులు సహజమైన పాలను వినియోగదారులకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మార్కెట్లో ప్యాకేజ్డ్ పాలు అందించే కంపెనీలు అనేకం ఉన్నాయి. కానీ, అవి స్టోరేజ్డ్ మిల్క్. ఈ నేపథ్యంలో ఆవు లేదా గేదెల నుంచి తీసిన పాలు 24 నుంచి 36 గంటల్లో కస్టమర్లకు చేర్చడమే లక్ష్యంగా ఇద్దరు మిత్రులు పాల వ్యాపారం మొదలు పెట్టారు. 2015లో స్థాపించిన బిజినెస్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం రూ.700 కోట్లకు చేరింది. ఆ సంస్థ పేరే కంట్రీ డిలైట్. చక్రధర్ గాడే, నితిన్ కౌశల్ దీనిని ప్రారంభించారు. తెలుగు బిగ్బాస్ షోలో ఇటీవల కంట్రీ డిలైట్ పేరు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దాని గురించి తెలుసుకుందాం.
11 రాష్ట్రాలకు విస్తరణ..
రూ.20 లక్షల పెట్టుబడితో కంట్రీ డిలైట్ పేరుతో దేశీ ఆవుపాలను డైరెక్ట్ టు హోం పేరుతో ప్రారంభించారు. ఇదే స్లోగన్ కస్టమర్లను ఆకట్టుకుంది. తాము పాలు పితికిన 24 నుంచి 36 గంటల్లో కస్టమర్లకు చేరుస్తామని ప్యాకేజ్ కాకుండా బాటిళ్లలో అందించడంతో ఆదరణ పెరుగుతూ వచ్చింది. దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 18 నగరాల్లో కంట్రీ డిలైట్ పాలు అందుబాటులో ఉన్నాయి. ఇక వ్యాపారం లక్షల నుంచి కోట్లకు చేరింది. ప్రస్తుతం కంట్రీ డిలైట్ బిజినెస్ విలువ రూ.700 కోట్లు.
ఇతర వ్యాపారాలు..
కంట్రీ డిలైట్ బ్రాండ్ నగర వాసులకు తెలియడం, సహజంగా ఉత్పత్తులు ఉండడంతో పాలతోపాటు పాల ఉత్పత్తుల వ్యాపారం కూడా మొదలు పెట్టారు. క్రమంగా పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తులను కూడా కంట్రీ డిలైట్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు. కంపెనీ ఉత్పత్తులను నమ్మకమైన రైతులు, వ్యాపారుల నుంచి సేకరించి కస్టమర్లకు అందిస్తోంది. సేకరించిన గంటల వ్యవధిలోనే కస్టమర్లకు చేరుస్తోంది. పదేళ్లలోనే కంపెనీ వ్యాపారం లక్షల నుంచి కోట్లకు చేరింది.
6 వేల మందికి డెలివరీ..
కంట్రీ డిలైట్ సంస్థ ఫోర్బ్స 2022 నివేదిక ప్రకారం 6 వేల మందికి నిత్యం పాలు డెలివరీ చేస్తున్నట్లు తెలిపింది. 5 మిలియన్లకుపైగా ఆర్డర్లును పూర్తి చేసి 30 వేల కన్నా ఎక్కువ ఇళ్లకు చేరుస్తుందని పేర్కొంది. పాలతోపాటు నెయ్యి, పనీర్, పప్పులు, నూనెలు, కూరగాయలు, పెరుగు, స్మూతీస్ వంటి వస్తువులను డెలివరీ చేస్తోంది.