రోమ్ నగరంలో సమీపంలో ఉన్న గ్రామాలకు గతంలో ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వెళ్లేవారు. అయితే ప్రస్తుతం ప్రజలు నగరాలకు వెళుతున్న నేపథ్యంలో గ్రామాలు నిర్మానుష్యంగా మారుతుండటం గమనార్హం. గ్రామాలకు పునర్వైభవం రావడానికి ఇటలీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. ప్రస్తుతం ఇటలీ సర్కార్ కేవలం ఒక్క యూరోకే ఇంటిని అందిస్తోంది.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఒక్క యూరోకే రోమ్ కు సమీపంలో ఉన్న మాయెంజా అనే పట్టణంలో ఇళ్లను అమ్మాలని నిర్ణయం తీసుకుంది. స్థానిక అధికారులు విడతల వారీగా ఇళ్లను విక్రయిస్తామని చెబుతున్నారు. ఈ నెల 28వ తేదీ నాటికి తొలి విడతలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ముగియనుండగా మధ్యయుగం నాటి నుంచి ఈ ప్రాంతం ఉందని రోమ్ కు దూరంగా ఉండే ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉందని సమాచారం.
ఇళ్లు కొన్నవాళ్లు మూడేళల్లో ఇంటిని పునరుద్ధరించుకుంటామని చెబుతూ 5000 యూరోలు ముందస్తుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇల్లు కొన్నవాళ్లు ఖచ్చితంగా ఆ ఇంట్లో నివాసం ఉండాల్సిన అవసరం లేదు. అయితే స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి ఆ ఇంటిని ఏ విధంగా వినియోగించుకోబోతున్నారో మాత్రం తెలియజేయాలి.