spot_img
Homeబిజినెస్Indian Businessmen Controversies: ఒకప్పుడు అపర కుబేరులు.. ఇప్పుడు పాతాళానికి... వీళ్ళ ఆర్థిక మోసం చాలామందికి...

Indian Businessmen Controversies: ఒకప్పుడు అపర కుబేరులు.. ఇప్పుడు పాతాళానికి… వీళ్ళ ఆర్థిక మోసం చాలామందికి గుణపాఠం

Indian Businessmen Controversies: వారు సెవెన్ స్టార్ హోటల్లో విడిది చేసేవారు. అత్యంత ఖరీదైన వాహనాలలో తిరిగేవారు. ఇతర దేశాలకు ప్రత్యేకమైన విమానాలలో మాత్రమే వెళ్లేవారు. వారు తాగే నీళ్లు.. తినే తిండి.. వేసుకునే దుస్తులు.. ఇలా ప్రతి ఒక్కటి లక్షల్లో ఉండేవి. వారి జీవన విధానం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. కొందరైతే అలా బతకాలని కోరుకునేవారు. అటువంటి విలాసవంతమైన జీవితాన్ని.. విజయవంతమైన వ్యాపార తంత్రాన్ని సాగించిన వారు చివరికి ఎలా మిగిలిపోయారంటే..

పెద్ద ఓడను సైతం ముంచేది చిన్న చిల్లే. వీరి వ్యాపారాన్ని కూడా చిన్న నిర్లక్ష్యం నిండా మించింది. ఆగర్భ శ్రీమంతులను కాస్త అనామకులను చేసింది. ఆకాశ హర్మ్యాలలో నివాసం ఉండేవారిని నేలకు దించింది. కొందరు దేశం విడిచి పరారీలో ఉంటే.. మరికొందరు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. అలా నష్టపోయిన వ్యాపారుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. ఇందులో మొదటి స్థానంలో అనిల్ అంబానీ ఉంటారు.

అనిల్ అంబానీ

అనిల్ అంబానీ పోగొట్టుకున్న డబ్బు విలువ అక్షరాల 3.14 లక్షల కోట్లు. 2008లో ఈయన ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద కుబేరుడుగా ఉండేవారు. అయితే ఈయన ఏర్పాటు చేసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ తీవ్ర నష్టాలను చవిచూసింది. తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోవడంతో ఈయన డౌన్ ఫాల్ అత్యంత వేగంగా సాగింది. 2008లో ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ధనవంతుడిగా ఉన్న ఆయన 2020 నాటికి తన నెట్ వర్త్ జీరో అని బ్రిటన్ కోర్టులో చెప్పుకునే స్థాయికి దిగజారిపోయాడు.

బైజు రవీంద్రన్

ఒకప్పుడు ఈయన సంపద 17500 కోట్లకు ఉండేది. పైగా భారత దేశంలోనే అతిపెద్దదైన ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీగా ఈయన బైజుస్ ఉండేది. ఇది టీమిండియా కు అధికారిక స్పాన్సర్ గా కూడా వ్యవహరించింది. రవీంద్రన్ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడటం.. నిబంధనలు మొత్తం పక్కన పెట్టడం.. పెట్టుబడు ధరలతో గొడవలు పెట్టుకోవడం వల్ల.. 2024లో ఈయన నెట్ వర్త్ జీరో అయిపోయింది.

నీరవ్ మోదీ

ఈయన గుజరాత్ రాష్ట్రంలో పేరుపొందిన వజ్రాల వ్యాపారి. పంజాబ్ నేషనల్ బ్యాంకు ను ఈయన నిండా ముంచారు. నకిలీ పాత్రలతో దాదాపు 13758 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. లండన్ పారిపోయారు.. ప్రస్తుతం లండన్ జైల్లో ఉంటున్నారు. అయితే లండన్ ప్రభుత్వం తనను భారతదేశానికి అప్పగించకుండా ఉండడానికి న్యాయపోరాటం చేస్తున్నారు.

మోహుల్ చోక్సీ

ఈయన గీతాంజలి జెమ్స్ కు అధినేతగా ఉండేవారు. అయితే ఈయన కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను నిండా ముంచారు. 13వేల కోట్ల స్కాంకు పాల్పడ్డారు. ఈ స్కాం బయటపడుతున్న నేపథ్యంలో తెలివిగా ఆంటిగ్వా దేశానికి వెళ్లిపోయారు. అక్కడ పౌరసత్వం తీసుకున్నారు. పైగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

విజయ్ మాల్యా

కింగ్ఫిషర్ కంపెనీకి వ్యవస్థాపకులుగా ఉండేవారు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు యజమానిగా ఉండేవారు. ఈయన కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ ద్వారా 9000 కోట్ల అప్పుల భారాన్ని తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నారు. ఆ అప్పులను ఎగ్గొట్టి లండన్ లో ఉంటున్నారు

వీజీ సిద్ధార్థ

ఈయన 2019లో నేత్రావతి నదిలో దూకి చనిపోయారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు ఈయన స్వయానా అల్లుడు. సుమారు 7200 కోట్ల అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు. మనదేశంలో చాలామందికి కాఫీ కల్చర్ ను ఈయన అలవాటు చేశారు. అప్పుల భారం పెరిగిపోవడం.. పెట్టుబడులు పెట్టినవారు ఒత్తిడి తీసుకురావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈయన భార్య కాఫీ డే ను టేక్ ఓవర్ చేసుకొని అప్పుల భారాన్ని మొత్తం తగ్గించారు. తెలివిగా సంస్థను నడిపిస్తున్నారు.

సత్యం రామలింగరాజు

ఐటి రంగంలో తెలుగు వ్యక్తిగా.. అధునాతన శక్తిగా ఆవిర్భవించారు రామలింగరాజు. సత్యం కంప్యూటర్స్ ఏర్పాటు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. కంపెనీ లాభాలను.. బ్యాంకు బ్యాలెన్స్లను అధికంగా చూపించి పెట్టుబడిదారులను మోసం చేశారు. 2009లో ఈ తప్పును స్వయంగా ఆయనే అంగీకరించారు. జైలుకు కూడా వెళ్లారు. ఈ స్కాం విలువ దాదాపు 7136 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

హర్షద్ మెహతా

ఈయనను స్టాక్ మార్కెట్ చరిత్రలో బిగ్ బుల్ అని పిలిచేవారు. బ్యాంకింగ్ సిస్టంలో అనేకలోసుగులను ఈయన వాడుకున్నారు. నకిలీ బ్యాంకు రసీదుల ద్వారా మార్కెట్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేవారు. కుంభకోణం బయటపడిన తర్వాత ఆయన అసలు కోణం వెలుగులోకి వచ్చింది.. దాదాపు 4వేల కోట్ల వరకు ఈయన అక్రమాలకు పాల్పడ్డారు. దీనిని 1992 స్టాక్ మార్కెట్ కుంభకోణం అని పిలుస్తుంటారు. ఇటీవల ఆయన జీవితం జైలులో ముగియడం విశేషం.

వాస్తవానికి వీరందరినీ కూడా ఒకప్పుడు విజయానికి చిరునామాగా పేర్కొనేవారు. మీడియా కూడా వీళ్ళ వార్తలను విపరీతంగా ప్రసారం చేసేది. వీరి విజయవంతమైన కథలను గాధలను గొప్పగా ప్రచురించేది. చేసిన తప్పు వల్ల.. ఆర్థిక అవకతవకలవల్ల చివరికి వీరి పరిస్థితి ఇలా మారిపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version