Anant Ambani Pre Wedding
Anant Ambani Pre Wedding: జరుగుతున్నది భారత బిజినెస్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీది. సుమారు రూ.1000 కోట్లతో ఈ వేడుకలు తన సొంత రాష్ట్రం అయిన గుజరాత్లోని జామ్నగర్లో నిర్వహిస్తున్నారు. మాతృభూమిపై మమకారంతో పెళ్లిని స్వదేశంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నీతా అంబానీ సుమారు నాలుగు నెలలు కష్టపడి ఏర్పాట్లు చేశారు. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న వేడుకలకు తొలి రోజు 50 వేల మందికి అన్నదానంతో ప్రారంభించారు. రెండోరోజు మూడో రోజు వీవీఐపీలు, వీఐపీలు హాజరయ్యారు.
అంగరంగ వైభవంగా..
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కుబేరుడి కొడుకు పెళ్లి కావడంతో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఖరీదైన గుడారాల్లో వీవీఐపీలకు విడిది ఏర్పాటు చేశారు. గానా భజానా, అతిథుల స్పీచ్లు, స్వాగతోత్సవాలు ఇలా అన్నీ ఘనంగా జరుగుతున్నాయి. ఎయిర్ పోర్టులో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి జామ్నగర్కు వచ్చే అతిథులను రిసీవ్ చేసుకుంటున్నారు. అక్కడి నుంచి వేడుక జరిగే ప్రాంతం వరకు రాచమర్యాదలతో తీసుకువస్తున్నారు.
స్పెషల్ రిటర్న్ గిఫ్ట్లు..
ఇక అనంత్ అంబానీ–రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్కు వస్తున్న వీవీఐపీలకు అంబానీ ఫ్యామిలీ రిటర్న్ గిప్ట్లు ఇస్తోంది. అయితే ప్రీవెడ్డింగ్ ఇంత ఘనంగా చేస్తున్నారు కాబట్టి రిటర్న్ గిఫ్ట్లు కూడా ఖరీదైనవి అయి ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ, నీతా అంబానీ ప్రత్యేక చొరవతో స్పెషల్ గిఫ్ట్లు తయారు చేయించారు. అవే మైనపు దీపాలు. అపూరూపంగా తీర్చిదిద్దారు. వీటిని మహాబలేశ్వర్కు చెందిన కళాకారులు తయారు చేశారు. ఈ కళాకారులకు కళ్లు కేవలం 10 శాతం మాత్రమే కనబడతాయి. కొందరు పూర్తిగా అంధులు. అలా విధివంచితుల చేతుల్లో ఆ మైనపు దీపాలు రూపుదిద్దుకున్నాయి. కొలనులో విచ్చుకున్న తామర పుష్పాల్లా వీటిని తయారు చేశారు. దృష్టిలోప కళాకారులు రూపొందించిన ఈ దివ్వెలే పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్గా అందించారు.
2014లో ప్రారంభం..
ప్రధాన నరేంద్రమోదీ 2014లో ప్రారంభించిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మహాబలేశ్వర్లో ఈ మైనపు దీపాలు తయారు చేస్తున్నారు. వీరిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అంబానీ ఫ్యామిలీ దృష్టిలోప కళాకారులకు ఆర్డర్ ఇచ్చారు. వారు తయారు చేసిన మైనపు దీపాలే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్గా వెళ్తున్నాయి.