YSRCP Social Media: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అండ ఆ పార్టీ సోషల్ మీడియా. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని రాజకీయం చేసింది. పూర్తిగా సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియా పార్టీ నాయకత్వంపై తిరగబడుతోంది. దానికి కారణాలు లేకపోలేదు. వారికి చెల్లింపులు నిలిచిపోవడంతో ఎక్కడికి అక్కడే వారు ఎదురు తిరుగుతున్నారు. ప్రధానంగా ఓ టీవీ ఛానల్ జర్నలిస్టు తో పాటు పార్టీ సోషల్ మీడియా వింగ్ చూస్తే సజ్జల భార్గవ్ రెడ్డి ఈ చెల్లింపులను నిలిపివేయడంపై ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఎనలిస్టుల రూపంలో వైసీపీకి మద్దతుగా మాట్లాడే ఓ ఇద్దరూ జర్నలిస్టులు ఇటీవల యూటర్న్ తీసుకున్నారు. దాని వెనుక ఉన్న కారణం కూడా అదే.
* ఆ జర్నలిస్ట్ పై కేసుతో..
ఓ ప్రముఖ ఛానల్ సీఈఓ గా వ్యవహరిస్తున్న ఓ జర్నలిస్టుపై ఇటీవల వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. కుమార్తెను చూసేందుకు ఏకంగా ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లారన్న ఆరోపణల నేపథ్యంలో.. కేంద్ర ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. అయితే వైసీపీతో పాటు అప్పట్లో గులాబీ పార్టీ భారీగా ఆయనకు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు టీవీ ఛానల్ ఏపీలో వైసీపీకి, తెలంగాణలో గులాబీ పార్టీకి అండగా నిలిచేది. అందుకే ఏపీలో వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు సైతం సదరు న్యూస్ ఛానల్ సీఈఓ చూసారనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ఏ కామెంట్స్ చేయాలి అనే దానిపై ఎప్పటికప్పుడు ఆయన దిశ నిర్దేశం చేసేవారట.
* వ్యాపారానికి మళ్లింపులు..
సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను చూసేవారు సజ్జల భార్గవ్ రెడ్డి. అప్పట్లో వైసీపీ సోషల్ మీడియాలో భారీగా నియామకాలు చేపట్టారు. చాలా ఏజెన్సీలు కూడా పనిచేసేవి. కానీ ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ చెల్లింపులను నిలిపివేసింది. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి నగదు సాయం నిలిచిపోయింది. కానీ ఇలా సోషల్ మీడియాకు ఇవ్వాల్సిన నగదును సదరు జర్నలిస్టు తో పాటు సజ్జల భార్గవరెడ్డి పక్కదారి పట్టించారనేది ఒక ఆరోపణ. రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాలకు మళ్లించారని జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఈ చెల్లింపులు నిలిపివేశారు అనేది ఒక ప్రచారం. అయితే చెల్లింపులు నిలిచిపోవడంతో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఇప్పుడు ఆందోళనలు చేసేందుకు సైతం సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. తప్పకుండా దీని ప్రభావం పార్టీపై పడుతుందని భావిస్తున్నాయి.
