Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా ఉందని.. బోండా ఉమామహేశ్వరరావు కు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అటువంటిదేమీ లేదని బోండా అనుచరులు చెబుతున్నారు. అయితే బోండా ఉమామహేశ్వరరావు ద్వారా కాపు రాజకీయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాపుల చుట్టూ రాజకీయం చేసి ఆ సామాజిక వర్గాన్ని కూటమి నుంచి దూరం చేయాలన్న ఆలోచనతో వైసిపి ఉంది. అందుకోసం ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పటికే వైసీపీ కాపు నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొందరైతే పొలిటికల్ అజెండా లేదని చెబుతున్నారు. రాజకీయాలకు అతీతంగా కాపు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ వారి అంతిమ లక్ష్యం కాపులను కూటమి నుంచి దూరం చేయడమే. ఇప్పుడు వెతుకుతున్న అంశం వైసీపీ కాలికి తగిలినట్లు అయింది. అందుకే బోండా ఉమామహేశ్వరరావు చుట్టూ రాజకీయాలు నడుపుతోంది వైసిపి.
* వివరణ కోరిన పార్టీ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వేదిక పంచుకోవడంతో పాటు ముద్రగడ పద్మనాభంను నిర్లక్ష్యం చేయడం వల్లే 2019లో టిడిపి ఓడిపోయింది అంటూ మాట్లాడారు బోండా ఉమామహేశ్వరరావు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ హై కమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిందని.. చంద్రబాబు స్పందించి వివరణ కోరాలని నిమ్మల రామానాయుడు ను ఆదేశించారని.. రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాస్ సోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు ప్రచారం నడిచింది. అయితే అటువంటిదేమీ లేదు అని బోండా ఉమామహేశ్వరరావు అనుచరులు చెబుతున్నారు. అయితే ఇదే అదునుగా బోండా ద్వారా రాజకీయం చేయాలని చూస్తోంది వైసిపి. ఇప్పుడు కాకపోయినా ఎన్నికలకు ముందైనా బోండా వైసీపీలో చేరడం ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం విస్తృతం చేస్తోంది. అనుకూల ఎనలిస్టులతో ఇదే అభిప్రాయం చెప్పిస్తోంది. తద్వారా బోండా చుట్టూ వివాదం రేకెత్తించి.. టిడిపి హై కమాండ్ ద్వారా ఆయన పై వేటు వేసే ప్లాన్ చేసింది. అయితే ఇదంతా పట్టించుకునే స్థితిలో లేరు బోండా ఉమామహేశ్వరరావు. టిడిపిని వీడిన మరుక్షణం ఆయన పరిస్థితి తెలియంది కాదు.
* టిడిపి కి వచ్చే నష్టం ఏంటి..
బోండా ఉమామహేశ్వరరావు వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయనకు మించి బలమైన నాయకుడిగా వంగవీటి రాధాకృష్ణ ఉన్నారు. ఆయనకు లైన్ క్లియర్ చేసినట్టు ఉంటుంది. వంగవీటి ఫ్యామిలీకి విజయవాడ నగరంలో మంచి ఫాలోయింగ్ ఉంది. కాపుల్లో కూడా ఇప్పటికీ ఆరాధన భావం కనిపిస్తుంది వంగవీటి మోహన్ రంగ పై. అయితే ఒకవేళ వైసీపీ ప్రలోభాలకు లొంగి బోండా ఉమామహేశ్వరరావు ఆ పార్టీలో చేరితే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. దానివల్ల వైసిపికి వచ్చే ప్రయోజనం లేదు. పైగా వంగవీటి రాధాకృష్ణకు లైన్ క్లియర్ చేసినట్టు ఉంటుంది. ఆ కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చి కాపులను మరింత మద్దతుదారులుగా కూటమి మార్చుకునే పరిస్థితి ఉంటుంది. అయితే అంతటి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ హై కమాండ్ వస్తుందా? బోండా ఉమామహేశ్వరరావు టిడిపిని వదులుకోగలరా? అనేది కూడా ఒక ప్రశ్న. కేవలం మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో బోండా ఉమామహేశ్వరరావు అలా చేసి ఉంటే మాత్రం చూడాలి. లేకుంటే కాపుల అంశాన్ని బయటకు తీసుకొచ్చి పార్టీని ఇబ్బందుల్లో పెట్టాలి అనుకుంటే ఆయనే ముందుగా మూల్యం చెల్లించుకుంటారు. టిడిపికి వచ్చే నష్టం ఏమీ లేదన్నది విశ్లేషకుల మాట.






