YSRCP Muslims Issue AP: మూలిగే నక్క పై తాటి పండు పడిన చందంగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అసలే కొత్త రాజధాని ప్రతిపాదనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఇటువంటి సమయంలో పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టారు. ఆయన స్వయంగా చేపట్టిన మత మార్పిడి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను దుమారానికి దారితీసింది. గత 30 సంవత్సరాలుగా ముస్లింలుగా ఉన్న తన బాల్య స్నేహితుడు అబ్దుల్లా, ఆయన భార్య అమ్మినాలను హిందూ ధర్మం లోకి ఆహ్వానిస్తూ.. తన నివాసంలోనే హిందూ పునః స్వీకరణ మహోత్సవం నిర్వహించడం చర్చకు దారి తీసింది. స్వయంగా తానే హోమాలు జరిపించి.. వాటిని మోటివేట్ చేసి.. మొత్తం మారుస్తున్నానని ఆయన ప్రకటించడం వైసిపికి చికాకుగా మారింది.
* ముస్లిం సమాజం పై ప్రభావం
కరుణాకర్ రెడ్డి చేపట్టిన ఈ వ్యవహారం ముస్లిం సమాజం పై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంది ముస్లిం మైనారిటీలు. అటువంటి ముస్లిములు ఇప్పుడు భూమన చర్య పై ఆగ్రహంగా ఉన్నారు. కేవలం బిజెపిని మెప్పించేందుకే ఇలా చేశారన్న అనుమానాలు ఉన్నాయి. అది కేవలం ఒక వ్యక్తిగత చర్య కాదు అని.. హిందుత్వ ఓటు బ్యాంకును ఆకర్షించే క్రమంలో తమ మనోభావాలను తాకట్టు పెడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు దూరమయ్యే అవకాశం ఉంది.
* ఆది నుంచి అండగా..
2014 నుంచి 2024 ఎన్నికల వరకు ముస్లింలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. ఇప్పటికీ వారు వైసిపి అంటేనే ఇష్టపడుతున్నారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా తన ఇంటిలోనే వేదికగా చేసుకుని మత మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించడం వల్ల.. తమను టార్గెట్ చేస్తున్నారన్న భావన ముస్లింలలో ఏర్పడుతోంది. మరోవైపు ఈ ఘటనపై వైయస్సార్ కాంగ్రెస్ నాయకత్వం మౌనంగా ఉంది. పైగా కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అందుకే ఇది పార్టీ అంతర్గత వ్యూహంలో భాగమే అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మున్ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చర్యలతో ముస్లింల నుంచి వ్యతిరేకత రావడం ఖాయమని తెలుస్తోంది.