YSRCP Kamma Leaders Reaction: ఏపీలో ప్రస్తుతం కులం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఫలానా కులం పేరు చెబితే ఫలానా పార్టీ అని ఇట్టే చెప్పేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గమంతా వైయస్సార్ కాంగ్రెస్.. కమ్మ సామాజిక వర్గమంతా టిడిపి.. కాపు సామాజిక వర్గం అంతా జనసేన అన్నట్టు పరిస్థితి ఉంది. కానీ నాయకత్వాలతో పడని సొంత సామాజిక వర్గం వారు ప్రత్యర్థి పార్టీల్లో చేరుతుంటారు. ఈ మూడు పార్టీలకు ఆ బెడద ఉంది. 2014, 2019లో రెడ్డి సామాజిక వర్గమంతా వైసిపి కి అండగా నిలిచింది. 2024 లో మాత్రం చేతులెత్తేసింది. 2014, 2024లో టిడిపికి అండగా నిలిచింది కమ్మ సామాజిక వర్గం. 2019లో మాత్రం చేతులెత్తేసింది. 2019లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ కు అండగా నిలవలేదు. 2024 లో మాత్రం ఏకపక్షంగా నిలిచింది పవన్ కళ్యాణ్ కు.
చంద్రబాబు వ్యతిరేకులంతా..
అయితే సామాజిక వర్గం ఎప్పుడు స్థిరంగా ఉండదు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే సామాజిక వర్గాలు పనిచేస్తాయని స్పష్టం అవుతోంది. అయితే చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకించే కమ్మ సామాజిక వర్గాన్ని చేరదీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ వారికి రాజకీయంగా ప్రోత్సహించింది చాలా తక్కువ. ప్రస్తుతం వైసీపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, తలసీల రఘురాం, దేవినేని అవినాష్, అబ్బయ్య చౌదరి వంటి నేతలే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్న పదిమంది నేతలు లోపు ఉంటారు. చంద్రబాబును దారుణంగా తిట్టించేందుకే అన్నట్టు వీరు ఉండేవారు. అయితే వీరిని ఉపయోగించుకున్నంతగా రాజకీయ ప్రయోజనాలు కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి.
రాజకీయ ప్రాధాన్యం లేక..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తలసీల రఘురాం జగన్ వెంట అడుగులు వేశారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి.. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల కోఆర్డినేటర్ గా పనిచేస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఆ కోఆర్డినేటర్ పదవిలో కొనసాగారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా టాక్ నడిచింది. కానీ ఎందుకో అంత ప్రాధాన్యం ఇవ్వలేదు.
కొడాలి నాని కి ఇచ్చినట్టే ఇచ్చి..
ఎంతో కొంత ప్రాధాన్యం దక్కింది అంటే కొడాలి నాని ద్వారా. మంత్రిగా చాన్స్ ఇచ్చారు. కానీ మంత్రి పదవిలో స్వేచ్ఛ ఇవ్వలేదు కానీ.. చంద్రబాబును తిట్టేందుకే అన్నట్టు కొడాలి నానితోపాటు వల్లభనేని వంశీ మోహన్ ను ప్రయోగించారు. కానీ వారి రాజకీయ జీవితాన్ని మాత్రం ఇబ్బందుల్లో పెట్టారు. ఇప్పుడు వైసీపీలో కమ్మ నేతలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. వారిని ఒక వివాదాస్పదులుగా చిత్రీకరించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఆ విషయం వైసీపీలో ఉన్న కమ్మ నేతలు తెలుసుకునేసరికి ఆలస్యం జరిగింది. అందుకు వారు మూల్యం చెల్లించుకున్నారు కూడా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా వారు తెలియడం లేదు. అంతలా వారి పొలిటికల్ కెరీర్ డ్యామేజ్ అయింది. జగన్మోహన్ రెడ్డి తమను ఇంతలా వాడుకున్నారా అని వారు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తమను పట్టించుకోకుండా కాపు నేతలకు ప్రోత్సాహం అందించడం పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
