AP Voter List Revision: ఏపీవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ సమగ్ర ఓటర్ల సవరణ ను ఆది నుంచి వ్యతిరేకిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఒక రకమైన ఆరోపణ చేస్తూ.. ఈ ప్రక్రియను మరో నెల రోజులపాటు పెంచాలంటూ కోరింది వైసిపి. ప్రతి పోలింగ్ బూత్ లో 50 చొప్పున తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను అధికార కూటమి ప్రభుత్వం తొలగిస్తోందని చెబుతోంది. అందుకే సర్ ప్రక్రియను మరో నెల రోజులు పెంచాలంటూ వైసీపీ నేతలు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ కు వినతి పత్రాలు అందజేశారు. అయితే ఆది నుంచి వైసీపీ ఈ ప్రక్రియ పై వ్యక్తం చేస్తున్న అనుమానాలకు బలం చేకూరుతోంది.
* పక్కా పారదర్శకంగా..
కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో బూత్ లెవెల్ అధికారులు నేరుగా ప్రతి ఇంటికి వెళ్లి.. నివాసం ఉంటున్న వారిని ఓటర్లుగా పరిగణిస్తూ.. పక్కా పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అర్హులైన ఏ ఒక్క సామాన్య పౌరుడి ఓటు పోయే అవకాశం లేదు. కానీ ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో చేర్చిన దొంగ ఓట్లు, చనిపోయిన వారి పేరుతో ఉన్న బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు మాత్రమే తొలగిస్తారు. అయితే ఇలా తొలగిస్తున్న ఓట్లన్నీ తమవే అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్ల వైసిపి హయాంలో ప్రతి నియోజకవర్గంలో… ప్రతి బూత్ పరిధిలో 50 నుంచి 100 వరకు పైగా అక్రమంగా ఓట్లు చేర్పించారని ఆరోపణలు ఉన్నాయి. అవి ఇప్పుడు బలపడుతున్నాయి.
* వైసిపి ఆందోళన..
ఒక బూత్ పరిధిలో 50 నుంచి 100 ఓట్లు తగ్గుతుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సమావేశమై పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరహాలోనే ఏపీలో కూడా విపక్షాల ఓట్లను భారీగా తొలగిస్తున్నారని.. క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక వైసీపీ నేతలు అయితే ఎలక్షన్ కమిషన్ చేసిన ప్రయత్నాన్ని తప్పుపడుతున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయం, ఆ పార్టీ అనుమానాలు బయటపడ్డాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తుండడంతో అవన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేర్పించినవి అని అర్థం అవుతోంది.
* అప్పట్లో దొంగ ఓట్లు..
గతంలో వైసిపి హయాంలో బై పోల్స్ ఎలా జరిగాయి ఇట్టే గుర్తు చేసుకోవచ్చు. సరిహద్దు జిల్లాల నుంచి వేలాది మందిని బస్సులు, లారీల ద్వారా తరలించి ఎలా ఓట్లు వేయించుకున్నారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల నకిలీ ఓట్లను ఏరిపారేసే క్రమంలో భాగంగా.. ఏపీలోనూ గట్టి చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రత్యేక డ్రైవ్ వల్ల తప్పకుండా బినామీ, దొంగ ఓట్లకు పడుతుంది. అయితే ఇప్పుడు తమ ఓట్లు పోతాయని ఈ రాజకీయ పార్టీ అయినా ఆరాటపడితే కచ్చితంగా అనుమానం వ్యక్తం చేయవచ్చు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై అదే అనుమానం బలపడుతోంది.

