YSRCP Damage Control: కడపలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ కు దిగింది. వైయస్ కుటుంబం పై జరుగుతున్న దాడిపై తొలిసారిగా ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన తాత హత్య గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తన తాతను చంపిన వారిని సైతం తాను ఏం చేయకుండా విడిచిపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అయ్యారు. గతంలో ఏం జరిగింది? వైయస్ రాజారెడ్డి పరిస్థితి ఏంటి? రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం వెనుక జరిగిన కథలు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు.. వారి స్వభావాల గురించి రకరకాల కథనాలు వచ్చాయి. వరుసగా బీటెక్ రవి, పార్థసారధి రెడ్డి లాంటి వారు స్టేట్మెంట్లు ఇచ్చారు. సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చకు దారితీసాయి. కానీ ఒక్కరంటే ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా దీనిపై స్పందించలేదు.
* ఒక్కరూ నోరు తెరవలే..
కడప జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. కడప జిల్లా వ్యవహారాలను ఎంపీ అవినాష్ రెడ్డి చూస్తున్నారు. పెద్ద ఎత్తున నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కానీ వైయస్ కుటుంబం పై వచ్చిన విమర్శలపై ఎవరూ స్పందించలేదు. దీంతో ఇదంతా నిజమే అన్నట్టు ప్రచారంలోకి వెళ్ళింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్లోకి దిగింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ హై కమాండ్ నుంచి కడప జిల్లా వైసీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ అంశంలో ఎందుకు వెనుకబడ్డారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
* అవినాష్ రెడ్డి ఘాటు స్పందన..
అయితే సాధారణంగా పెద్దగా మాట్లాడరు వైయస్ అవినాష్ రెడ్డి. హై కమాండ్ నుంచి ఏం ఆదేశాలు వచ్చాయో తెలియదు కానీ.. వైయస్ కుటుంబం పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. బీటెక్ రవి పై విరుచుకుపడ్డారు. నువ్వెంత నీ బతుకు ఎంత అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయేందుకు సిద్ధపడ్డావని.. ఇప్పుడు అదే వైసీపీని కొనుగోలు చేసే స్థాయికి చేరావంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అవినాష్ రెడ్డి. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగానే అవినాష్ రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడకపోవడం లోటు. ఇకనుంచి వరుసగా వైసీపీ నేతలు రంగంలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
