YSR Congress Party: బిజెపి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా పొదుపుగా వ్యవహరిస్తుంది. ఏపీ రాష్ట్ర నాయకులను మాత్రం విమర్శిస్తూ.. కేంద్ర నాయకత్వాన్ని మాత్రం గౌరవిస్తూ వస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ పాలన గురించి కానీ.. కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి కానీ బాహాటంగా విమర్శలు చేసే సాహసం చేయదు. ఎందుకంటే కేంద్రం కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని తెలుసు. అందుకే బిజెపి పెద్దల విషయంలో నోరు తెరిచేందుకు ఎవరూ సాహసించరు. కానీ ఆ సాహసం చేశారు పేరుని నాని. హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ చేసిన పొదుపు మాటలపై కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. తనదైన శైలిలో సెటైర్లు కూడా వేశారు. అయితే నాని కాదు.. ఇదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి చెబితే బాగుంటుంది అనేది నెటిజెన్ల సూచన. ప్రధాని లాంటి నేతపై పేర్ని నాని వ్యాఖ్యానించడం ఏమిటని.. అదేదో జగన్మోహన్ రెడ్డి చెప్పవచ్చు కదా అన్నవారు ఉన్నారు.
* ప్రధాని సూచనలపై..
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో పర్యటించిన సంగతి తెలిసిందే. పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రజలు విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోలు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అయితే ప్రధాని వ్యాఖ్యలపై పేర్ని నాని ఘాటుగా స్పందించారు. ప్రజలను బంగారం కొనొద్దు.. విదేశాలకు వెళ్లొద్దు… పెట్రోల్ వాడకం తగ్గించుకోమని చెబుతున్న ప్రధాని.. ఆయన ఆచరణలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకు నీతులు చెప్పేముందు ప్రధాని ఆచరించి చూపాలని సూచించారు పేర్ని నాని. అంతటితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణ ఖర్చులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
* తరచూ ప్రయాణాలపై విమర్శలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ పాలకులపై కూడా అదే తరహా ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రయాణాలపై అప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తోంది ఆ పార్టీ. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ ప్రయాణాలకు ఖర్చులపై పేర్ని నాని మాట్లాడడం హాట్ టాపిక్ అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ సాధారణ పౌరుల మాదిరిగా రైళ్లలో లేదా కమర్షియల్ ఫ్లైట్లో ప్రయాణించాలని సూచించారు. పశ్చిమ ఆసియా యుద్ధాన్ని సాకుగా చూపి సామాన్యుడిపై నియంత్రణలు విధించడం సరికాదని నాని అభిప్రాయపడ్డారు. అయితే మోడీని విమర్శించేందుకు వైసిపి నేతలు ముందుకు రారు. కానీ ఇటీవల తమిళనాడులో విజయ్ వ్యవహారంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి నాని విమర్శించారంటే… బిజెపి విషయంలో వైసీపీ స్టాండ్ మారినట్లు స్పష్టమవుతోంది.